AFGAN QUAKE : ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్న అప్ఘానిస్తాన్పై ప్రకృతి కన్నెర్ర చేసింది. భూకంపాలు ఒకవైపు… వరదలు మరోవైపు.. జనాలకు ఊపిరాడకుండా చేస్తున్నాయ్. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు దేశం పరిస్థితి తయారైంది. ఆకలి కేకలతో బాధపడుతున్న దేశంలో.. ఇప్పుడు చావు కేకలు వినిపిస్తున్నాయ్. దీంతో ఐక్యరాజ్యసమితి, అనుబంధ సంస్థలు సాయం అందిస్తున్నాయ్. భూకంపం, వరదల ఘటనలో 15వందల మంది చనిపోగా.. రోజులు గడిచేకొద్దీ మృతుల సంఖ్య మరింత పెరిగే చాన్స్ ఉంది.
తాలిబన్ల పాలనలో అఫ్ఘానిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయ్. ఆదాయం లేదు.. అప్పు పుట్టదు. కొండెక్కిన నిత్యావసరాల ధరలతో.. జనాలు అల్లాడిపోతున్నారు. బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దేశం నలుమూలలా వినిపిస్తున్న ఆకలి కేకలు ఒకవైపు.. ప్రకృతి ప్రకోపాలు మరోవైపు.. అఫ్ఘానిస్తాన్ జనాలను ఊపిరాడకుండా చేస్తున్నాయ్. భూకంపాలు ఒకవైపు.. వరదలు మరోవైపు.. ప్రాణాలు తీస్తున్నాయ్. దీంతో అయ్యో.. అఫ్ఘానిస్తాన్ అనాల్సిన పరిస్థితి ఎదురైంది.
భూకంపం.. అఫ్ఘానిస్తాన్లో ప్రళయం సృష్టించింది. తూర్పు అఫ్ఘానిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్లో కంపించిన భూమి.. వెయ్యి మందిని పైగా పొట్టన పెట్టుకుంది. దాదాపు 15వందల మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయ్. భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే భూకంప తీవ్రత కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రిక్టర్ స్కేల్పై 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం సంభవించిన ప్రాతం మారుమూల పర్వత ప్రదేశం కావడంతో పూర్తి సమాచారం బయటకు రావడం లేదు. దీంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది.
Also read : Afghanistan Earthquake: అఫ్ఘానిస్తాన్లో భారీ భూకంపం.. 250 మంది మృతి!
యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం… భూకంప కేంద్రం అఫ్ఘానిస్తాన్లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో.. 51 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం కారణంగా తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఖోస్ట్ ప్రావిన్స్లో కూడా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. భారీ తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు పాక్లోని లాహోర్, ముల్తాన్, క్వెట్టా వరకు విస్తరించాయ్. పాక్టికా ప్రావిన్స్… పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉంది. దీంతో పొరుగుదేశం పాకిస్థాన్లోనూ భూకంపం సంభవించింది. రోజులు గడుస్తున్న కొద్దీ… మృతుల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయ్.
భూకంపం ప్రళయం సృష్టిస్తే.. మరోవైపు వరదలు విలయం సృష్టిస్తున్నాయ్.. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో దాదాపు 4వందల మంది చనిపోయారు. కునార్, నంగన్హర్, నురిస్తాన్, లగ్మన్, పంజ్షీర్, పర్వాన్, కాబూల్, కాపిస, మైదాన్ వర్ధక్, బమియాన్, ఘాజ్ని, లోగర్, సమంగన్, తఖార్, పక్తియా ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయ్. భారీ వర్షాల కారణంగా చాలా ఇళ్లు కూలిపోగా.. వేల మంది క్షతగాత్రులుగా మిగిలారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాలిబన్లు అధికారంలోకి వచ్చాక.. అప్ఘానిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కొంటోంది. ఉపాధి లేక, ఉద్యోగాలు దొరక్క.. తిండి లేక.. ఆకలి తీర్చుకునే మార్గం తెలియక.. అప్ఘానిస్తాన్లో చాలామంది అర్దాకలితో చచ్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రకృతి ఆ దేశంపై కన్నెర్ర చేస్తోంది. దీంతో తమకు అంతర్జాతీయ సాయం కావాలని తాలిబన్లు ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తున్నారు.
అఫ్ఘానిస్తాన్కు సాయం చేసేందుకు ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు ప్రయత్నాలు చేస్తున్నాయ్. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి… అఫ్ఘానిస్తాన్లో ప్రపంచంలోని అతిపెద్ద మానవతా కార్యక్రమంలో పాలుపంచుకుంటోంది. దేశ జనాభాలో సగం మందికి పైగా ఆకలితో అలమటిస్తున్నారు. UHCR, UN రెఫ్యూజీ ఏజెన్సీతో పాటు పలు సంస్థలు.. పకిటికా, ఖోస్ట్ ప్రావిన్సులలోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు సిబ్బందిని పంపాయ్. ప్రస్తుతం ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించడానికి, అలాగే సహాయక చర్యలపై దృష్టి కేంద్రీకరించింది.