newborn baby conceived : వైద్యరంగంలో సంచలనం నమోదైంది. అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువు తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చి వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన ఇజ్రాయెల్లోని ఆష్డోడ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ శిశువులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. మనిషి రూపాన్ని సంతరించుకున్న ఈ పిండాల్లో గుండె, ఎముకలు కూడా అభివృద్ధి చెందాయంట. వైద్యులు సర్జరీ చేసి పిండాలను తొలగించి శిశువుకు వైద్యం అందిస్తున్నారు. ఇలాంటివి చాలా అరుదుగా 10 లక్షల మందిలో ఒకరిలో కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు.
ఆష్డోడ్ లోని ఆస్సుటా మెడికల్ సెంటర్లో ఓ మహిళ ఈ నెల తొలివారంలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ప్రసవ సమయానికి ముందు గర్భిణీకి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు జరిపిన వైద్యులు గర్భంలోని ఆడ శిశువు పొట్టభాగం సాధారణ ఎత్తు కన్నా ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ప్రసవం అనంతరం శిశువుకు ఆల్ట్రాసౌండ్, ఎక్స్రే పరీక్షలు జరిపిన వైద్యులు శిశువు కడుపులో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు ఉన్నట్లు గుర్తించారు.
నియోనాటాలజీ విభాగం డైరెక్టర్ ఓమర్ గ్లోబస్ నేతృత్వంలో వైద్యులు శిశువుకు సర్జరీ చేసి పలు పిండాలను బయటకు తీశారు. శిశువు కడుపులో ఉన్న పిండాలు ఇప్పుడిప్పుడే రూపాలను సంతరించుకుంటున్నాయని, ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని డాక్టర్ ఓమర్ గ్లోబస్ తెలిపారు. తల్లి గర్భంలో కవల పిండాలు తయారవుతున్న సమయంలో కొంత వృద్ధి చెందిన పిండంలోకి మరో పిండం వెళ్లడం వల్ల ఇలాంటివి వెలుగులోకి వస్తాయని వెల్లడించారు.