Nobel Peace Prize : ఇద్దరు జర్నలిస్ట్ లకు నోబెల్ శాంతి బహుమతి

పిలిప్పీన్స్‌ మరియు రష్యాకు చెందిన ఇద్దరు జర్నలిస్ట్ లు-మారియా రెస్సా, దిమిత్రి ముర‌టోవ్‌లు ను ఈ ఏడాదికిగాను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు శుక్రవారం రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ

Nobel (3)

Nobel Peace Prize    పిలిప్పీన్స్‌ మరియు రష్యాకు చెందిన ఇద్దరు జర్నలిస్ట్ లు-మారియా రెస్సా, దిమిత్రి ముర‌టోవ్‌ లను ఈ ఏడాదికిగాను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు శుక్రవారం రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది. ప్రజాస్వామ్యానికి మరియు సుదీర్ఘ శాంతి స్థాప‌నకు మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ వీరిని ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్‌ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా.. స్వేచ్ఛ పరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో పిలిప్పీన్స్‌లో మారియా రెస్సా, ర‌ష్యాలో దిమిత్రి ముర‌టోవ్‌లు భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ కోసం అసాధార‌ణ‌మైన పోరాటాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు నోబెల్‌ కమిటీ కమిటీ ప్రశంసించింది. ప్ర‌జాస్వామ్యం-ప‌త్రికా స్వేచ్ఛ కోసం వాళ్లు చేస్తున్న పోరాటం స్పూర్తిదాయ‌క‌మ‌ని క‌మిటీ పేర్కొన్న‌ది.

అధికార దుర్వినియోగం, అసత్యాలు, యుద్ధ కాంక్ష నుంచి రక్షించడానికి స్వేచ్ఛా, స్వతంత్ర, వాస్తవ-ఆధారిత జర్నలిజం ఉపయోగపడుతుందని స్వీడిష్​ కమిటీ తెలిపింది. భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాచార స్వేచ్ఛ.. ప్రజలకు సమాచారం ఇవ్వటానికి ఉపయోగపడుతుందన్న వాదనతో ఏకీభవిస్తున్నట్లు పేర్కొంది. ప్రజాస్వామ్యం, యుద్ధం, సంక్షోభాల నుంచి కాపాడేందుకు.. ఈ హక్కులు చాలా కీలకమని నోబెల్‌ కమిటీ తెలిపింది.

రష్యాకు చెందిన జర్నలిస్టు దిమిత్రి మురటోవ్‌… మీడియా స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక నొవాజా గజెటా ను 1993లో స్థాపించిన వ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. ఈ పత్రికను ప్రారంభించిప్పటి నుంచి రష్యా దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు. స‌త్యాన్ని రాయ‌డం, ప్రొఫెష‌న‌ల్‌గా వార్త‌ల‌ను అందించ‌డంలో నోవాజా గెజిటాకు మంచి గుర్తింపు వ‌చ్చింది. ర‌ష్యాలో మ‌రే మీడియా చేయ‌లేని ప‌ని ముర‌టోవ్ చేశారు. దీంతో ఎన్నోసార్లు ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అయినప్పటికీ మురాటోవ్‌ వెనుకడుగు వేయకుండా తమ సిద్ధాంతాలను పాటిస్తూ వస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను రక్షించడంలో చూపించిన ధైర్యసాహసాలకు మురాటోవ్ కు 2007లో సీపీజె అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డును గెలుచుకున్నాడు.

ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు మరియా రెస్సా… తమ దేశంలో నానాటికీ పెరుగుతున్న అధికార దుర్వినియోగం, హింసను తన కలంతో ప్రపంచానికి తెలియజేశారు. భావ స్వేచ్ఛ‌తో ఆ దేశంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను ఆమె బ‌య‌ట‌పెట్టారు. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్‌’ పేరుతో ఓ డిజిటల్‌ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్‌ సీఈఓగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధ్య‌క్షుడు డ్యుటెర్టో చేస్తున్న అరాచ‌కాల‌పై ఆమె దృష్టి పెట్టారు. వివాదాస్ప‌ద పాల‌న‌, హ‌ద్దు లేని మ‌ర్డ‌ర్లు, యాంటీ డ్ర‌గ్ క్యాంపేన్ పేరుతో సాగిన దుశ్చ‌ర్య‌ల‌ను ఆమె నిల‌దీశారు. అయితే అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే.. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ వస్తున్నారు.

ALSO READ  ఆర్యన్‌కు షాక్.. మళ్లీ బెయిల్ నిరాకరణ..!