Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో ఘోర భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత.. 10 అడుగుల ఎత్తున సునామీ హెచ్చరిక
దక్షిణ ఫిలిప్పీన్స్ను సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం (Philippines Earthquake)వణికించింది
- V Santhosh Kumar
- Published on- June 8, 2026 / 10:36 AM IST
philippines earthquake general santos airport damaged tsunami warning issued
- ఫిలిప్పీన్స్లో 7.8 భారీ భూకంపం.
- జనరల్ శాంటోస్ విమానాశ్రయం ధ్వంసం.
- తీరప్రాంత దేశాలకు సునామీ హెచ్చరికలు.
Philippines Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్ను సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఉదంతంతో తీరప్రాంత నగరాలు ఒక్కసారిగా కుదిపివేయబడటంతో భారీగా ఆస్తినష్టం చోటు చేసుకుంది. ముఖ్యంగా సుమారు 7 లక్షల జనాభా కలిగి, ట్యూనా ప్రాసెసింగ్ పరిశ్రమకు నిలయమైన జనరల్ శాంటోస్ నగరం ఈ భూప్రకంపనల ధాటికి తీవ్రంగా ప్రభావితమైంది.
శాస్త్రవేత్తల వివరాల ప్రకారం.. జనరల్ శాంటోస్ నగరానికి నైరుతి దిశగా 8 మైళ్ల దూరంలో, భూగర్భంలో 6.2 మైళ్ల లోతులో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఈ భారీ భూకంపం(Philippines Earthquake) కారణంగా అక్కడి జనరల్ శాంటోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం అందింది. భూకంపం సృష్టించిన భయాందోళనల నేపథ్యంలో, ఫిలిప్పీన్స్ తీరంలో సుమారు 10 అడుగుల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు ఈ భూకంప ప్రభావంతో పసిఫిక్ సునామీ సెంటర్ కూడా అప్రమత్తమైంది. ఇండోనేషియా, మలేసియా దేశాల్లో 3 అడుగుల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉందని, అలాగే తైవాన్, జపాన్, పపువా న్యూ గునియా దేశాలు కూడా దీనివల్ల ప్రభావితం కావొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతానికి ఫిలిప్పిన్స్ తీర ప్రాంతాల్లో మూడడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడుతుండటంతో తీరప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
