Liz Truss: కాబోయే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్కి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
‘‘బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా ఎంపికైనందుకు లిజ్ ట్రస్కి అభినందనలు. మీ నాయకత్వంలో ఇండియా-బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. కొత్త బాధ్యతల్లో కొత్త పాత్ర పోషించబోతున్న మీకు శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో లిజ్ ట్రస్ను మోదీ ట్యాగ్ చేశారు.
- tony bekkal
- Published On : September 5, 2022 / 07:18 PM IST
PM Modi congratulates Liz Truss for being elected as UK PM
Liz Truss: అన్ని అడ్డంకులు తొలగించుకుని తొందరలోనే బ్రిటన్ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు లిజ్ ట్రస్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. బ్రిటన్లో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన కొద్ది సమయానికే ట్వట్టర్ ద్వారా మోదీ స్పందిస్తూ ‘‘బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా ఎంపికైనందుకు లిజ్ ట్రస్కి అభినందనలు. మీ నాయకత్వంలో ఇండియా-బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. కొత్త బాధ్యతల్లో కొత్త పాత్ర పోషించబోతున్న మీకు శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో లిజ్ ట్రస్ను మోదీ ట్యాగ్ చేశారు.
బ్రిటన్ ప్రధాని పదవి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి హోదాకు పోటీ చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునక్ ఓడిపోయారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. దీంతో ఆమె త్వరలోనే బ్రిటన్ ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్నారు. బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ పదవికి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు బ్రిటన్ విదేశాంగ మంత్రిగా లిజ్ ట్రస్ ఉన్నారు. ట్రిస్ ట్రస్ కు ఈ ఎన్నికల్లో 81,326 ఓట్లు రాగా, రిషి సునక్ కు 60,399 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం 82.6గా నమోదైంది. 20,927 ఓట్ల మెజార్టీతో రిషి సునాక్పై లిజ్ ట్రస్ గెలిచారు. రేపు బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి అధికారికంగా రాజీనామా చేస్తారు. బోరిస్ జాన్సన్ నుంచి లిజ్ ట్రస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ గత శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసిన విషయం తెలిసిందే.
దీంతో నేడు కన్జర్వేటివ్ పార్టీ కొత్త అధినేత, బ్రిటన్ ప్రధాని పేరును ప్రకటించారు. రిషి సునాక్ గెలిస్తే బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర లిఖించేవారు. లిజ్ ట్రస్ ముందు ఇప్పుడు అనేక సవాళ్ళు ఉన్నాయి. బ్రిటన్ లో ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా నియంత్రించాల్సి ఉంది. అలాగే, జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్) కూడా నియంత్రించాల్సి ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అధికంగా ఉండడం వల్ల యూకే ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందని విమర్శలు ఉన్నాయి.
