Sandstorm : చైనాలో ఇసుక తుఫాను.. 300 అడుగుల ఎత్తుకు ఇసుక రేణువులు

చైనాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి చాలా పట్టణాలు వరదనీటిలోనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే చైనాలోని డుంహుయాంగ్ నగరాన్ని ఇసుక తుఫాను చుట్టుముట్టింది. 300 అడుగుల మేర ఇసుక రేణువులు గాల్లోకి తేలాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.

Sandstorm

Sandstorm : చైనా దేశం వర్షాలతో అతలాకుతలం అవుతుంది. అనేక నగరాలు నీట మునిగాయి. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి పలు నగరాల్లో పరిస్థితి అదుపులోకి రాలేదు. చైనా వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, మనుషుల దృశ్యాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం. బీజింగ్ తోపాటు అనేక నగరాలు వరదలతో అల్లాడాయి. ఇప్పటికి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ఉంది. గత వెయ్యేళ్ళలో ఇటువంటి వరదలు ఎప్పుడు రాలేదని చైనా అధికారులు, నేతలు చెబుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే చైనాను ఇసుక తుఫాను రూపంలో మరోముప్పు వచ్చిపడింది. చైనాలోని డుంహుయాంగ్ నగరం గోబీ ఎడారిని అనుకోని ఉంటుంది. ఇక్కడ ఆదివారం భారీ ఇసుక తుఫాను వచ్చింది. ఇసుక రేణువులు సుమారు 300 అడుగుల మేర పైకి లేశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు నిమిషాల వ్యవధిలో రోడ్లను మూసేశారు. ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు జారీచేశారు. ఆకాశమే భూమిని తాకినట్లుగా ఉన్న ఈ తుఫాను చూసి డుంహుయాంగ్ వాసులు బెంబేలెత్తిపోయారు.

పెద్దగా నష్టం జరగలేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అధికారుల అప్రమత్తతతో ప్రజల ప్రాణాలు కాపాడమని తెలిపారు. ఇసుక తుఫాను వచ్చిన సమయంలో ఆక్సిజన్ తీసుకోవడం కష్టంగా ఉంటుందని, ఊపిరాడక చాలామంది చనిపోతారని తెలిపారు. కానీ డుంహుయాంగ్ నగరంలో అలాంటిది జరగలేదని తెలిపారు. తుఫాను కొద్దిసేపటితర్వాత శాంతించిందని.. ఇసుకరేణువులు నగరమంతా వెదజల్లబడ్డాయని తెలిపారు.