Srilanka Announces Defaulting Its External Debts
Srilanka Announces Defaulting its External Debts : శ్రీలంక అత్యంత తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆకలితో లంకవాసులు అల్లాడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి తీసుకున్న అప్పు కట్టలేం అంటూ చేతులెత్తేసింది శ్రీలంక. దీనికి సంబంధించి శ్రీలంక ఆర్థిక శాఖ సంచలన ప్రకటన కూడా చేసింది. ‘ఇక మావల్ల కాదు విదేశాల నుంచి తీసుకున్న అప్పులు కట్టలేం అంటూ ప్రకటించింది..!!
విదేశాల నుంచి తీసుకున్న 5,100 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.88 లక్షల కోట్ల) అప్పులను కట్టబోమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి బెయిల్ అవుట్ ఇంకా పెండింగ్ లోనే ఉందని, కాబట్టి అప్పులను కట్టలేమని పేర్కొంది. 1948లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అత్యంత బాధాకరమైన తిరోగమనంలో లంక కొట్టుమిట్టాడుతోంది. దేశంలోని 22 మిలియన్ల మంది ప్రజలకు సుదీర్ఘమైన రోజువారీ విద్యుత్ ఆగిపోవడంతో పాటు తీవ్రమైన ఆహారం..ఇంధన కొరతలు చెప్పుకోలేనంత కోలుకోలేనంత బాధలను తెచ్చిపెట్టాయి. దీంతో ప్రజలు ఆగ్రహావేశాలతో ఏం చేయాలో పాలుపోక అల్లాడిపోతున్నారు. వారి ఆక్రోశం..ఆవేదన ఎంతగా ఉందంటే..ఇటీవల ప్రజలు ప్రభుత్వ నాయకులు,భద్రతా దళాల ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నించడంతో నిరసనకారులను టియర్ గ్యాస్ మరియు రబ్బరు బుల్లెట్లతో చెదరగొట్టారు.
Also read : Oil from Russia: రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే నెలవారీ చమురు పరిమాణం యూరోప్ లో ఒక పూట వినియోగంతో సమానం
ఇటువంటి అత్యంత దారుణ పరిస్థితుల్లో నలిగిపోతున్న శ్రీలంక తమకు అప్పులిచ్చిన దేశాలు వడ్డీ కావాలంటే దేశంలోనే వేరే ఇతర మార్గాలనుంచైనా తీసుకోవచ్చని లేదా శ్రీలంక రూపీల్లో కట్టించుకునేందుకు అంగీకరించాలని తేల్చి చెప్పింది. అయితే, శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ అధికారులు మాత్రం అప్పులు చెల్లించడాన్ని తాత్కాలికంగా మాత్రమే రద్దు చేస్తున్నామని చెబుతున్నారు.
ఇప్పుడున్న డాలర్లతో అప్పులు కడితే తిండి గింజలు, నిత్యావసరాల దిగుమతులపై పెను ప్రభావం పడే ముప్పుందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుల చెల్లింపును తాత్కాలికంగా రద్దు చేసి ఆ డాలర్లను దిగుమతులకు చెల్లిస్తామని అంటున్నారు. ప్రస్తుతం అప్పు చెల్లింపులు తమకు పెద్ద తలనొప్పిగా మారాయని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ తెలిపారు. ఇప్పుడు అప్పులు కట్టడం అసాధ్యం కూడా అని స్పష్టం చేశారు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్.
Also read : Bandi Sanjay Kumar: రైతుల ముసుగులో దాడులు చేయించేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్