Sri Lanka
Sri Lanka:శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో పన్నెండు మంది వరకు గాయపడ్డారు. కొన్ని వారాలుగా జరుగుతున్న ఆందోళనల్లో ఒక పౌరుడు మరణించడం ఇదే మొదటిసారి. శ్రీలంకలోని రంబుక్కాన పట్టణంలో మంగళవారం ఈ కాల్పుల ఘటన జరిగింది.
Sri lanka crisis : శ్రీలంకలో ప్రజా ఆందోళనలు ఉధృతం.. రోడ్లపైకొచ్చి మద్దతు తెలిపిన క్రికెటర్స్
కొంతకాలంగా శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రజలకు ఆహారం, తాగునీరు కూడా దొరకడం లేదు. వైద్య సేవలు అందడం లేదు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కూడా దొరకడం లేదు. రోజూ పదమూడు గంటలకుపైగా కరెంటు కోతలు విధిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అధికారంలో ఉన్న రాజపక్స కుటుంబానికి వ్యతిరేకంగా ప్రజలు కొన్ని వారాలుగా ఆందోళనలు చేస్తున్నారు. గత నెలలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇంటిపైకి ఆందోళనకారులు దూసుకొచ్చారు. అయితే, అప్పుడు సైన్యం వారిని అడ్డుకోగలిగింది. అప్పట్నుంచి ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రాజపక్స కుటుంబం అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రంబుక్కాన పట్టణంలో నిరసనకారులు హైవేను నిర్బంధించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, పన్నెండు మంది గాయపడ్డారు. పోలీసుల అత్యుత్సాహంతోనే కాల్పుల ఘటన జరిగిందని గాయపడ్డవారిలో ఒక వ్యక్తి తెలిపాడు. ఈ ఘటనతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు రంబుక్కాన పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి, రాళ్లు విసిరారు.