Thailand : థాయ్‌లాండ్ వెళ్లాలనుకునే భారతీయులకు బిగ్‌షాక్.. ఆ విధానం రద్దు.. కొత్త వీసా రూల్స్ ఇవే..

Thailand : థాయ్‌లాండ్ వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. వీసారహిత ప్రవేశ నిబంధనలను కఠినతరం చేసింది.

Thailand

Thailand : థాయ్‌లాండ్ వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. పర్యాటక రంగంలో ప్రముఖ దేశమైన థాయ్‌లాండ్ విదేశీ పర్యాటకులకోసం అమల్లో ఉన్న వీసారహిత ప్రవేశ నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పటి వరకు ఉన్న 60రోజుల వీసారహిత (visa – free) ప్రవేశాన్ని అకస్మాత్తుగా రద్దు చేసింది. దీంతో జూన్, జులై నెలల్లో థాయ్‌లాండ్ ట్రిప్ వెళ్లాలనుకొని ప్లాన్ చేసుకున్న ఫ్యామిలీలపై ఆదేశ ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.

Also Read : TVK Vijay : డీఎంకే దెబ్బకు దిగొచ్చిన సీఎం విజయ్.. ఆ టెండర్ రద్దు.. ఇద్దరు అధికారులు సస్పెండ్.. ఆరు గంటల్లోనే టెండర్ ముగియడంపై పెద్ద రచ్చ..

గతంలో నిబంధనల ప్రకారం.. 90కిపైగా దేశాలకు 60రోజులపాటు వీసా ఫ్రీ స్టే అమల్లో ఉండేది. కానీ, ప్రస్తుతం విదేశీయుల నేర కార్యకలాపాలు పెరుగుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో వీసీ ఫ్రీ స్టేను తగ్గించింది. ఇటీవల డ్రగ్స్ కేసులు, సెక్స్ ట్రాఫికింగ్, అక్రమ హోటళ్లు, పాఠశాలల నిర్వహణ వంటి కేసుల్లో విదేశీయులు అరెస్టు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

తాజా వీసా రూల్స్ ప్రకారం.. భారతీయులు ఇప్పుడు వీసా ఆన్ అరైవల్ (VoA) సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా గరిష్ఠంగా 15రోజులు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి ఉంటుంది. ఎయిర్ పోర్టులో దిగిన తరువాత 2వేల థాయ్ బాట్ (టీహెచ్‌బీ) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మీ దగ్గర తగినంత నగదు, తిరుగు ప్రయాణానికి సంబంధించిన కన్ఫర్మ్ విమానం టికెట్ ఉండాలి. ఎంట్రీ పర్మిట్ పొందాలంటే కౌంటర్ దగ్గర ఈ డాక్యుమెంట్లు ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ 15రోజుల కంటే ఎక్కువ రోజులు ఆ దేశంలో ఉండాలనుకుంటే ముందుగానే రెగ్యులర్ టూరిస్ట్ వీసా కోసం అప్ల్ చేసుకోవాలి. దీని ప్రక్రియకు మూడు నుంచి ఐదు పనిదినాలు సమయం పడుతుంది.

కోవిడ్ తర్వాత పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు 2024లో థాయ్‌లాండ్ 60 రోజుల వీసా మినహాయింపు విధానాన్ని తీసుకొచ్చింది. అయితే పర్యాటకుల సంఖ్య ఇంకా కరోనా ముందు స్థాయికి చేరుకోకపోవడంతో పాటు, కొన్ని వర్గాలు ఈ సడలింపులను దుర్వినియోగం చేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.