స్టాక్‌ మార్కెట్ల చరిత్రలో సరికొత్త రికార్డ్

The newest record in the history of stock markets : సెన్సెక్స్‌లో సంచలనం నమోదైంది. రికార్డ్ స్థాయిలో 50 వేల మార్క్‌ను దాటింది. ఇంటర్నేషనల్‌ పాజిటివ్ ట్రెండ్స్‌తో మార్కెట్లు ఆల్‌ టైం హై కు చేరాయి. కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలు, డిమాండ్‌ పతనం, ఇవన్నీ బీఎస్‌ఈలో బుల్‌ దూకుడును అడ్డుకోలేకపోయాయి. ఎట్టకేలకు తొలిసారి 50 వేల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ప్రధాన రంగాల సూచీల్లోని అన్ని రంగాల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

నిన్న అమెరికాలో బైడెన్‌ సర్కారు ప్రమాణ స్వీకారం చేయడం మార్కెట్లో జోరును నింపింది. ముఖ్యంగా ట్రంప్‌ విధించిన ఆర్థిక ఆంక్షలు తొలగే అవకాశాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరో భారీ ఆర్థిక ప్యాకేజీ అమెరికాలో వెలువడే అవకాశం ఉడటం కూడా సూచీల్లో ఉత్తేజం నింపింది. ఐటీ, ఫార్మా రంగ షేర్లు కదం తొక్కడంతో సెన్సెక్స్‌ చారిత్రక గరిష్ఠ స్థాయి తాకింది. గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, జేకే టయర్స్‌, సూర్య రోష్ని లిమిటెడ్‌, హవేల్స్‌ ఇండియా షేర్లు భారీ లాభాల్లో ఉండగా.. వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌, జీఎంఎం, ఆగ్రోటెక్‌ ఫూడ్స్‌, టాటా ఎలిక్సిలు భారీ నష్టాల్లో ఉన్నాయి.

కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు మళ్లీ ఊతమివ్వడానికి అమెరికా ట్రెజరీ కార్యదర్శిగా జనెట్‌ యెల్లెన్‌ నియమిస్తూ అమెరికా నూతన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి తోడు కార్పొరేట్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండటంతో, అమెరికా మార్కెట్లు పరుగులు తీశాయి. నిన్న అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయిలో లాభాలను నమోదు చేశాయి. డోజోన్స్‌ 0.83 శాతం, ఎస్‌అండ్‌పీ 500 1.39 శాతం, నాస్‌డాక్‌ 1.97 శాతం లాభపడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు