జపాన్లో 6.7 తీవ్రతతో భూకంపం.. వణికిపోయిన ప్రజలు.. సునామీ హెచ్చరికలు జారీ..
ఈ ప్రకంపనల కారణంగా బుల్లెట్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది.
- T Venkateshwarlu
- Updated on- November 9, 2025 / 06:24 PM IST
Japan earthquake: ఉత్తర జపాన్ తీర ప్రాంతంలో ఆదివారం సాయంత్రం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ఐవాతే ప్రిఫెక్చర్లో భవనాలు కంపించాయి. ప్రజలు భయంతో వణికిపోయారు.
జపాన్ వాతావరణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. సన్రికు తీరానికి సమీపంలోని పసిఫిక్ సముద్రంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. (Japan earthquake)
జపాన్ వాతావరణ సంస్థ ఒక మీటరు (3 అడుగులు) ఎత్తు వరకు సునామీ సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఐవాతే ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో భూకంప తీవ్రత స్థాయి 4గా నమోదైందని తెలిపింది.
Also Read: ఇక ఈ పనులు చేస్తే కేసులు.. డ్రోన్లతో నిఘా..: హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి
ప్రభుత్వ ప్రసార సంస్థ ఎన్హెచ్కే ప్రజలను తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, మరికొన్ని ప్రకంపనలు సంభవించే అవకాశముందని హెచ్చరించింది.
ఒఫునాటో, ఒమినాటో, మియాకో, కామైషి ప్రాంతాల్లో చిన్న సునామీ అలలు కనపడ్డాయి. కుజి ప్రాంతంలో 20 సెంటీమీటర్ల (8 అంగుళాలు) ఎత్తు వరకు అలలు నమోదయ్యాయి. ఈ ప్రకంపనల కారణంగా బుల్లెట్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది.
సునామీ అలలు గంటలపాటు కొనసాగవచ్చు, మరింత ఎత్తు పెరుగవచ్చని నిపుణులు పేర్కొన్నారు. పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఉన్న జపాన్ భూకంపాలకు అత్యంత ప్రభావితమయ్యే దేశం. 2011లో ఈ ప్రాంతం భూకంపం, సునామీతో తీవ్ర నష్టాన్ని చవిచూసింది. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టి ఉన్న అగ్నిపర్వతాల వలయం, ఇది భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతం.
