Afghanistan-Taliban Crisis: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబుల్ చివురుటాకులా వణికిపోతోంది. ఐసిస్ ఉగ్రవాదుల ఆత్మాహుతి బాంబు దాడులతో హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి. ఈ బాంబు దాడిలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 180 దాటిపోగా.. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మరోవైపు ముష్కరులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా వార్నింగ్ ఇస్తోంది.
ప్రస్తుతం కాబుల్ విమానాశ్రయం అమెరికా బలగాల ఆధ్వర్యంలోనే ఉండగా.. ఎయిర్పోర్టు వెలుపల, అక్కడ పోటెత్తుతున్న జనాన్ని సాయుధ తాలిబన్లు నియంత్రిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పినప్పుడల్లా వారు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. దాడులు జరిగే ప్రమాదముందని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నా.. కాబుల్ విమానాశ్రయానికి జనం పోటెత్తుతూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఇస్లామిక్ స్టేట్-ఖోరాసన్ “ప్లానర్”పై వైమానిక దాడి చేసింది అమెరికా. ఇస్లామిక్ స్టేట్ సభ్యుడిపై అమెరికా వాయుసేన బాంబుల వర్షం కురిపించాయి. కాబూల్ పేలుళ్లు జరిగిన 48 గంటల తర్వాత నంగహర్లో ఇస్లామిక్ స్టేట్ అటాక్ ప్లానర్పై దాడి చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ మిలటరీ శనివారం స్పష్టంచేసింది. కాబూల్ పేలుళ్ల సూత్రధారి అయిన నంగహర్ లోని కీలక ఐసిస్ ఖోరాసన్ సభ్యుడిపై అమెరికా సైనికులు జరిపిన వైమానిక దాడిలో అతను మరణించాడని అమెరికా వెల్లడించింది.