Jury Verdict Against Meta and Google : ‘సోషల్ మీడియా వ్యసనం అయ్యేలా చేసి నాశనం చేశారు..’ గూగుల్, మెటా మీద కేసు వేసి రూ.56కోట్లు గెలిచిన ధీన వనిత..
Jury Verdict Against Meta and Google : అమెరికాలో ఏఐ సహాయంతో ఓ న్యాయవాది గూగుల్, మెటా సంస్థలపై కేసు వేసి న్యాయ విజయం సాధించారు. ఈ కేసులో బాధితురాలికి 6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.57 కోట్లు) పరిహారం చెల్లించాలని జ్యూరీ తీర్పు ఇచ్చింది.
- Harish Thanniru
- Published on- June 16, 2026 / 07:32 PM IST
Jury Verdict Against Meta and Google
Jury Verdict Against Meta and Google : అమెరికాలో ఏఐ సహాయంతో ఓ న్యాయవాది గూగుల్, మెటా సంస్థలపై కేసు వేసి న్యాయ విజయం సాధించారు. టెక్సాస్కు చెందిన ప్రముఖ ట్రయల్ లాయర్ మార్క్ లానియర్ తన బృందంతో కలిసి ఏఐ సాంకేతికతను వినియోగించి సోషల్ మీడియా వ్యసనానికి సంబంధించిన కేసులో విజయం సాధించారు. ఈ కేసులో బాధితురాలికి 6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.57 కోట్లు) పరిహారం చెల్లించాలని జ్యూరీ తీర్పు ఇచ్చింది.
ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు తనను ఆన్లైన్ బానిసను చేశాయంటూ ఓ 20ఏళ్ల అమ్మాయి వేసిన కేసును వాదించేందుకు ఏఐ సాయం తీసుకున్నట్లు టెక్సాస్కు చెందిన లాయర్ మార్క్ లానియర్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసుకు సంబంధించి మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ముందు.. ఏఐ దాదాపు 100 ప్రశ్నలను రూపొందించగా, వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. కాలక్రమేణా తన పని విధానాన్ని ఏఐ అర్థం చేసుకుని, తన శైలికి అనుగుణంగా సూచనలు ఇవ్వగలిగిందని చెప్పారు. దాదాపు కేసు పూర్తయ్యే నెల రోజుల వరకు ఏఐ టూల్స్ను కేసు కోసం వాడుకున్నట్లు వెల్లడించారు.
చాట్ జీపీటీ, క్లాడ్, జెమిని వంటి ప్రధాన మోడళ్లకు యాక్సెస్ను అందించే కస్టమైజ్డ్ చేసిన బూడిల్ బాక్స్ అనే ఏఐ ప్లాట్ఫాంను కేసు విచారణకోసం వాడుకున్నట్లు వివరించారు. అయితే, దీనికోసం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా న్యాయరంగంలో ఏఐని గేమ్ ఛేంజర్గా అభివర్ణించారు.
కేసు విషయానికొస్తే.. తాను ఎనిమిదేళ్ల వయసులోనే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ ఖాతాలు తెరిచానని. వీటిలో ఉండే ఇన్ఫినిట్ స్క్రోలింగ్ (ఆగకుండా వచ్చే వీడియోలు, పోస్టులు)కు అలవాటు పడి బానిసలా మారానని బాధితురాలు పేర్కొన్నారు. దీంతో తన బాల్యాన్ని, మానసిక ప్రశాంతతను కోల్పోయానని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాగే చాలామంది సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్నారని న్యాయవాది లానియర్ తెలిపారు.
ఈ యాప్లు ప్రమాదకరమని తెలిసినా మెటా, గూగుల్ వాటిని సరిచేయడం కానీ, యూజర్లను హెచ్చరించడం కానీ చేయట్లేదని వాదించారు. దీంతో కోర్టు బాధితురాలికి ఆయా సంస్థలు ఆరు మిలియన్ డాలర్ల (రూ.56 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందులో మెటా 70శాతం చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని యూట్యూబ్ చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుతో తాము ఏకీభవించడం లేదని, అప్పీల్కు వెళ్లనున్నట్లు రెండు సంస్థలు ప్రకటించాయి.
