భారత ప్రధాని యుక్రెయిన్‌ టూర్‌.. నరేంద్ర మోదీ శాంతి మంత్రం ఫలించేనా..?

రష్యా టూర్‌తో అగ్ర దేశాల చూపు తిప్పుకున్న భారత ప్రధాని.. ఇప్పుడు యుక్రెయిన్‌ పర్యటనతో మరోసారి వరల్డ్‌ వైడ్‌ సరికొత్త చర్చకు తెరలేపారు.

Narendra Modi visit Ukraine: రష్యా- ఉక్రెయిన్‌.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న దేశాలు.. ఒక దేశం పేరెత్తితే మరో దేశానికి రక్తం మరిగిపోతుంది. మాటలతో కాదు.. యుద్ధంతోనే సమాధానమన్నట్లు ఒకరిపై ఒకరు దాడులు, ప్రతి దాడులు, ఆక్రమణలు.. ఇలాంటి సమయంలో శాంతిమంత్రం వేసేందుకు పెద్దన్న హోదా దేశాలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపలేదు. కానీ.. భారత ప్రధాని మోదీ.. ఈ చిక్కుముడి విప్పేందుకు అడుగులు వేస్తున్నారు. రష్యా టూర్‌తో అగ్ర దేశాల చూపు తిప్పుకున్న భారత ప్రధాని.. ఇప్పుడు యుక్రెయిన్‌ పర్యటనతో మరోసారి వరల్డ్‌ వైడ్‌ సరికొత్త చర్చకు తెరలేపారు.

మోదీ టూర్‌ వైపే ప్రపంచ దేశాల చూపు 
ఎవరి మాటా వినరు.. యుద్ధమే శరణమంటారు.. అగ్రదేశాలు ఆపాలనుకోవు. రష్యా-యుక్రెయిన్‌ ఎవరూ తగ్గేదేలే అంటారు. అటు పుతిన్‌.. ఇటు జెలెన్ స్కీ.. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. ఇదీ పరిస్థితి. ఇలాంటి క్రిటికల్ వార్‌ సిచ్యుయేషన్‌లో ఏ దేశమైనా తలదూర్చడమెందుకనుకుంటుంది. కానీ.. భారత ప్రధాని మోదీ.. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపే దిశగా శాంతిమంత్రమెయ్యాలని చూస్తున్నారు. ఇప్పటికే రష్యా పర్యటించి పుతిన్‌తో చర్చించిన ఆయన.. ఇప్పుడు 23న యుక్రెయిన్‌ టూర్‌లో జెలెన్‌స్కీతో భేటీ అవనున్నారు. దీంతో ప్రపంచ దేశాల చూపు మోదీ టూర్‌ వైపే ఉంది.

ఘర్షణతో ఒరిగేదేముండదు.. యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు.. చర్చలతో ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు.. ఇలా అటు రష్యాకు, ఇటు యుక్రెయిన్‌కు రెండున్నరేళ్లుగా చెబుతున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండియానే. ప్రధాని మోదీ రష్యా-యుక్రెయిన్‌ వార్‌ మొదలైనప్పట్నుంచి ఆ దేశాల మధ్య సఖ్యతనే కోరుకుంటున్నారు.

Also Read: రష్యాలోకి చొచ్చుకెళ్లి మరీ వరుస దాడులు.. యుక్రెయిన్ రివర్స్ అటాక్ వెనుక ప్లాన్ ఏంటి?

22వ ఇండియా-రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఆహ్వానంతో జులై 8న మాస్కోలో పర్యటించారు ప్రధాని మోదీ. ఈ టూర్‌లో పుతిన్‌ మోదీ ఆత్మీయంగా కౌగిలింత.. ప్రపంచ దేశాల్లో అనేక ప్రశ్నలకు తావిచ్చింది. భారత్‌ రష్యా వైపు ఉందనుకునేలా ప్రచారం చేసింది. పుతిన్‌, మోదీ కలిసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఈ టూర్‌పై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యుక్రెయిన్‌పై దారుణాలకు పాల్పడుతున్న రష్యాతో.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ అంత సన్నిహితంగా ఉండటమేంటని ప్రశ్నించారు. మోదీ, పుతిన్ ఆలింగనం చేసుకున్న రోజు కీవ్‌లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా దాడి జరిగింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టారు జెలెన్‌స్కీ.

రష్యాలో పర్యటించిన నెల రోజుల వ్యవధిలోనే..
ఇప్పుడు రష్యాలో పర్యటించిన నెల రోజుల వ్యవధిలోనే.. మోదీ యుక్రెయిన్‌కు వెళ్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. 2022లో రష్యా, యుక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా యుక్రెయిన్‌లో అడుగు పెడుతున్నారు. 2022 ఫిబ్రవరిలో రష్యా-యుక్రెయిన్ మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత, ఇటలీ, జర్మనీల్లో జరిగిన జీ-7 సదస్సులో ప్రధాని మోదీ, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫస్ట్‌ టైమ్‌ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలూ ఒకరికొకరు ఆలింగనం చేసుకుని.. యుద్ధ పరిస్థితులపై చర్చించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసిపోవాలంటే శాంతియుత చర్చలే మార్గమని అప్పుడే జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రధాని అయ్యారు. అప్పుడు మోదీకి జెలెన్‌స్కీ కూడా అభినందనలు తెలిపారు. దీంతో వీరి మధ్య సన్నిహిత వాతావరణమే ఉంది.

Also Read: నేను అధ్యక్షుడిని అయితే..! ఎలాన్ మస్క్ గురించి డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన..

అయితే ఇప్పుడు పరిస్థితులు వేరు రష్యా, యుక్రెయిన్‌ వార్‌ పీక్స్‌కు చేరింది. దాదాపు రెండున్నరేళ్లు గడిచిపోయాయి. రెండు వైపులా ఎంతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిపోయింది. కానీ పట్టుదలకు పోయి వెనకడుగు వేయడం లేదంతే. మధ్యలో రాజీ కుదిర్చే ప్రయత్నాలు కూడా అగ్రదేశాలు చేయకపోవడంతో.. వార్ కంటిన్యూ అవుతోంది. ఓపక్క నాటో దేశాలన్నీ యుక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న వేళ.. మోదీ రష్యాలో పర్యటించడం.. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు నెరిపారు. ఇప్పుడు యుక్రెయిన్‌ వెళ్లి అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలుస్తున్నారు. ఇంతకీ ఇండియా వ్యూహం ఏంటి..? ఇదే ఇప్పుడు అంతటా ట్రెండింగ్‌ టాపిక్‌.

ట్రెండింగ్ వార్తలు