Mark Zuckerberg
Mark Zuckerberg : మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ అంటే తెలియని వారు ఉండరు. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్లో ఉండే ఈయన.. తాజాగా మియామిలోని అత్యంత ఖరీదైన, భద్రత కలిగిన ‘ఇండియన్ క్రీక్ ఐలాండ్’లో ఏకంగా 170 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,415 కోట్లు) వెచ్చించి ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. మియామి-డెడ్ కౌంటీ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఇంటి ఒప్పందంగా రికార్డు సృష్టించింది. డెవలపర్ వ్లాడ్ డోరోనిన్ 2025లో తన స్టార్ ఐలాండ్ భవనాన్ని 120 మిలియన్ల డాలర్లకు విక్రయించడం గతంలో రికార్డును నెలకొల్పింది. ప్రస్తుతం ఆ రికార్డును జుకర్ బర్గ్ తుడిపేశారు. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ ఆరోన్ రోలిన్స్ నుండి ఈ ఎస్టేట్ ను ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఇల్లు ఉన్న ‘ఇండియన్ క్రీక్ ఐలాండ్’ సామాన్యమైన ప్రదేశం కాదు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ‘బిలియనీర్ బంకర్’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడికి వఎళ్లడం అందరికీ సాధ్యం కాదు. ఈ ద్వీపంలో కేవలం 40 ఇళ్లు మాత్రమే ఉంటాయి. నివాసితుల కోసం ప్రత్యేక పోలీస్ దళంతో అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తారు. ఇప్పటికే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇక్కడ రెండు ఇళ్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం జుకర్ బర్గ్ కూడా ఆయనకు సమీపంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
‘బిలియనీర్ బంకర్’ గా ప్రసిద్ధి చెందిన ఈ ద్వీపంలో జుకర్బర్గ్ కొనుగోలు చేసిన భవనం నిర్మాణ దశలో ఉంది. ఆయన అభిరుచికి తగినట్లు దానిని నిర్మాణం చేస్తున్నారు. ఇది 1.84 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో మెగా మాన్సన్లో తొమ్మిది బెడ్ రూమ్లు, 11 బాత్ రూమ్లు, వాటర్ ఫ్రంట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ డాక్ వంటివి ఉన్నాయి. అత్యాధునిక జిమ్, హెయిర్ సెలూన్ తో పాటు లైబ్రరీలో ఒక రహస్య మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తుండటం దీని ప్రత్యేకత.
జుకర్బర్గ్కు మయామిలోని ఈ భవనం శాశ్వత నివాసంగా ఉంటుందా.. లేదంటే అతను రియల్ ఎస్టేట్ పోర్ట్పోలియోలో మరొక ఆస్తిగా ఉంటుందా అనేది స్పష్టత లేదు. జూకర్బర్గ్ కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో, లేక్ టాహోతో పాటు వాషింగ్టన్, డీసీ, హవాయి ద్వీపమైన కౌయిలో ఇళ్లను కలిగి ఉన్నారు.