Malashri Husband Ramu: కరోనా మహమ్మారి కారణంగా టాలీవుడ్ సీనియర్ రైటర్, డైరెక్టర్ సాయి బాలాజీ మరణించారనే వార్త మర్చిపోకముందే.. ప్రముఖ నిర్మాత రాము కూడా కోవిడ్ బారిన పడి మృతి చెందారనే విషయంతో ఫిలిం వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి…
తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణించి, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని పొందిన నటి మాలాశ్రీ భర్త, సినీ నిర్మాత కుణిగల్ రాము (52) కొవిడ్తో మృతిచెందారు. వారం క్రితం కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ.. సోమవారం సాయంత్రం కన్నుమూశారు.
తుమకూరు జిల్లా కుణిగల్కు చెందిన రాము.. కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా కొనసాగారు. ‘గోలీ బార్’ సినిమా ద్వారా నిర్మాతగా పరిచయమైన ఆయన దాదాపు 39 సినిమాలు నిర్మించారు. శాండల్వుడ్లో కోట్లాది రూపాయలతో సినిమా తీసిన నిర్మాతగా ‘కోటి రాము’ గా ఆయన పేరొందారు.
‘ఏకే 47’, ‘లాకప్ డెత్’, ‘కలాసి పాళ్య’ లాంటి బ్లాక్బస్టర్ సినిమాలను నిర్మించారు రాము. కన్నడ సినిమా రంగంలో హీరోయిన్గా రాణిస్తున్న మాలాశ్రీని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రాము మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. నివాళులు అర్పిస్తున్నారు..