హైదరాబాద్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌ ‘మేడే’ ప్రారంభం..

  • Publish Date - December 11, 2020 / 07:03 PM IST

Ajay Devgn’s Mayday: బిగ్‌ బి అమితాబ్‌, బాలీవుడ్ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ‘మే డే’ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. అజయ్‌ దేవగణ్‌ ఎఫ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై అజయ్ దర్శక నిర్మాతగా వ్యవహరించడం ఓ విశేషం అయితే.. అమితాబ్‌ బచ్చన్‌ను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తుండడం అలాగే ఏడేళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడం మరో విశేషం.

ఈ చిత్రంలో అజయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభమైంది. రెగ్యులర్‌ షూటింగ్‌ సైతం ఈ రోజే మొదలుపెట్టారు. అలాగే, ఏప్రిల్‌ 29, 2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తొలి సన్నివేశానికి అజయ్‌ దేవగణ్‌ స్నేహితుడు, ప్రముఖ తెలుగు జోతిష్యులు బాలు మున్నంగి క్లాప్‌ ఇచ్చారు. ఈ ఏడాది బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ‘తానాజీ’ చిత్రానికి సైతం ఆయనే క్లాప్‌‌నివ్వడం విశేషం.


తన సినిమా ప్రారంభం సందర్భంగా హీరో అజయ్‌ దేవగణ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు ‘మే డే’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా పూర్తయ్యేవరకూ ఏకధాటిగా చిత్రీకరణ చేస్తాం. భగవంతుడితో పాటు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం కోరుకుంటున్నా. నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానుల మద్దతుతో పూర్తి చేస్తాం. ఏప్రిల్‌ 29, 2022న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.