Bommai on Nehru row: అంబేద్కర్ని మరిపించేందుకే ఇవన్నీ.. ‘నెహ్రూ’ పోస్టర్ వివాదంపై సీఎం బొమ్మై
‘‘నెహ్రూని పక్కన పెట్టామని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దేశంలోని ప్రధానమంత్రులందరి కోసం పార్లమెంట్లో మ్యూజియం కడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోదీ. గతంలో ఏ ప్రధాని ఇలా ఆలోచించలేదు. నెహ్రూతో పాటు అందరి ప్రధానులను వారి సేవలను మేం గౌరవిస్తాం. నిజానికి మేమిచ్చిన ప్రకటనలో అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. వారిని మరింపించేందుకే కాంగ్రెస్ ఈ ప్రయత్నాలు చేస్తోంది’’ అని అన్నారు.
- tony bekkal
- Published On : August 15, 2022 / 06:18 PM IST
Attempts were made to forget BR Ambedkar says Bommai on Nehru row
Bommai on Nehru row: నెహ్రూ ఫొటోను ప్రభుత్వ ప్రకటనలో వేయనందుకు కాంగ్రెస్ చేస్తున్న దాడిని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తిప్పి కొట్టారు. బాబాసాహేబ్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రిలను ప్రజల ఆలోచన నుంచి మరిపించేందుకు కాంగ్రెస్ ఈ ప్రయత్నాలు చేస్తోందని ఆయన మండి పడ్డారు. విపక్ష నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధినేత డీకే సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఈ విషయమై బొమ్మై ప్రభుత్వంపై రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం వివిధ పత్రికలకు ప్రకటన ఇచ్చింది. ఇందులో గాంధీ, నేతాజీ, పటేల్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సావర్కర్, అంబేద్కర్, తిలక్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్ర పాటిల్, లాల్ బహదూర్ శాస్త్రి, మౌలానా అబ్దుల్ లాంటి వారి చిత్రాలను ప్రచురించి వారి గురించి ఒక్కో వాక్యం రాసుకొచ్చారు. అయితే ఇందులో నెహ్రూ బొమ్మ వేయలేదు. దేశ ప్రధానమంత్రి అయిన జవహార్లాల్ బొమ్మ ఎందుకు వేయలేదని కాంగ్రెస్ ఒంటి కాలిపై లేచింది. సీఎం బొమ్మై తీవ్ర స్థాయిలో మండిపడింది.
ఈ విషయమై సిద్ధరామయ్య స్పందిస్తూ బొమ్మైని రాష్ట్రీయ స్వయం సేవక్ బానిస అంటూ వ్యాఖ్యానించారు. బ్రిటిషర్లు వెళ్లడంతోనే బానిసత్వం పోయిందని చెబుతున్నప్పుడు బొమ్మై ఎందుకు ఆర్ఎస్ఎస్ బానిసలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి దేశ తొలి ప్రధాని ఫొటోను వేయకపోవడం ఎంత క్రూరమైన చర్యనో బొమ్మై ఆలోచించాలని సిద్ధూ అన్నారు. ఆర్ఎస్ఎస్ చెప్పినట్లు బీజేపీ నడుస్తోందని, ఆ ఆదేశాల మేరకే భారత తొలి ప్రధానమంత్రి ఫొటోను వేయలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
దీనిపై సోమవారం బొమ్మై స్పందిస్తూ ‘‘నెహ్రూని పక్కన పెట్టామని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దేశంలోని ప్రధానమంత్రులందరి కోసం పార్లమెంట్లో మ్యూజియం కడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోదీ. గతంలో ఏ ప్రధాని ఇలా ఆలోచించలేదు. నెహ్రూతో పాటు అందరి ప్రధానులను వారి సేవలను మేం గౌరవిస్తాం. నిజానికి మేమిచ్చిన ప్రకటనలో అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. వారిని మరింపించేందుకే కాంగ్రెస్ ఈ ప్రయత్నాలు చేస్తోంది’’ అని అన్నారు.
Shivamogga: సావర్కర్ పోస్టర్ వివాదం.. కర్ణాటకలోని శివమొగ్గలో హైటెన్షన్
