Bihar Assembly Speaker tests positive for Covid but recovers in a day
Bihar Assembly Speaker: తనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా ఆదివారం ప్రకటించారు. విచిత్రంగా ఆ మరుసటి రోజైన సోమవారమే నెగిటివ్ రిపోర్ట్ను స్వయంగా ఆయనే షేర్ చేశారు. కేవలం ఒకే రోజులో కొవిడ్ నుంచి రికవరీ అయినట్లు ఆయన చెప్పకనే చెప్పారు. కాగా, ప్రస్తుతం బిహార్లో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అనంతరం ఏం జరుగుతుందో రాజకీయ విశ్లేషకులకు కూడా అంతు పట్టడం లేదు. ఈ సందర్భంలో స్పీకర్ది ఎంత కీలకమైన పాత్రలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
భారతీయ జనతా పార్టీకి చెందిన విజయ్ కుమార్ సిన్హా, రెండు రోజుల వ్యవధిలో కొవిడ్పై రెండు ప్రకటనలు చేయడం కొంత ఆశ్చర్యాన్ని, కొంత అనుమానాన్ని కల్పిస్తున్నాయి. పైగా ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీకి చెందిన వ్యక్తే కావడం.. ఇక నెటిజెన్లకు కావాల్సినంత సరుకును అందించింది. స్పీకర్ నెగిటివ్ రిపోర్ట్పై నెటిజెన్లు ట్రోల్స్ వేస్తున్నారు.
ఇకపోతే, ఆర్జేడీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ స్పీకర్ పరిధిలో ఉంది. ఈ విషయమై బీజేపీ నేత రాం నారాయణ్ మండల్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ సోమవారం రాత్రి స్పీకర్ని కలిసి రిపోర్ట్ అందించింది. గతేడాది మార్చిలో బిహార్ అసెంబ్లీలో విపక్ష సభ్యులు స్పీకర్పైకి దూసుకెళ్లిన అంశంపై అనర్హత వేటు వేయాలనే ప్రతిపాదన ఉంది. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది బయటికి స్పష్టం చేయకపోయినప్పటికీ స్పీకర్కు అందిన రిపోర్టులో అన్ని వివరాలు పేర్కొన్నారట.
విధాన సభ సెక్రటేరియట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు ఎమ్మెల్యేలపై స్పీకర్కు నోటీసులు అందాయని, చట్ట ప్రకారం తదుపరి నిర్ణయాన్ని స్పీకర్ తీసుకోనున్నట్లు వెల్లడించారు. మార్చిలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యేలు ఇచ్చే వివరణను బట్టి స్పీకర్ సంతృప్తి పొందితే అనర్హత ఉండకపోవచ్చని, లేని పక్షంలో 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడొచ్చని అంటున్నారు. ఈ పరిణామాలతో పాటు నితీష్ వర్సెస్ బీజేపీ నేపథ్యంలో స్పీకర్ ఒక రోజులోనే కొవిడ్ నుంచి కోలుకోవడం పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.