Elephant Attack : ఒక్కోసారి ఎవరూ ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. మనం ఒకటి అనుకుంటే, మరొకటి జరుగుతుంది. ఊహకందని విధంగా కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి. ఆ కొత్త పెళ్లి జంటకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఓ ఏనుగుతో వెడ్డింగ్ ఫొటో షూట్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఏనుగు బీభత్సం సృష్టించింది. కోపంతో ఊగిపోయింది. దాడికి దిగింది. దీంతో అక్కడున్న వారంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు.
కేరళలోని గురువాయూర్ లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఈ నెల 10న ఆలయంలోని ఓ ఏనుగుతో ఓ కొత్త జంట వెడ్డింగ్ ఫొటో షూట్ చేసింది. ఏనుగు సమీపంలో నిల్చుని దంపతులు ఫొటోలు తీయించుకుంటున్నారు. ఇంతలో ఏం జరిగిందో కానీ, ఏనుగులో కోపం కట్టలు తెంచుకుంది.
అంతే.. మావటి (ఏనుగును నియంత్రించే వ్యక్తి)పై తొండంతో దాడి చేసింది. ఎత్తి కింద పడేసింది. ఈ క్రమంలో మావటి దుస్తులు ఊడిపోయాయి. అయితే, అతడు ఏనుగు దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న వారంతా బిత్తరపోయారు. భయంతో పరుగులు తీశారు. ఫొటో షూట్ తీయించుకుంటున్న దంపతులు, వారి బంధువులు కూడా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.