ఇంట్లో దెయ్యం భయం.. కాలనీ మొత్తం ఖాళీ
- Subhan Ali Shaik
- Published On : February 24, 2021 / 10:04 AM IST
ghost house colony
Ghost House: ఇంట్లో దెయ్యముందని ఏకంగా కాలనీ మొత్తం ఖాళీ చేశారు. ప్రాణ భయంతో బేడ, బుడగ జంగాల ప్రజలు పారిపోయారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో సుమారు 40 కుటుంబాలు కాలనీని విడిచిపెట్టి పోవడంతో కాలనీ పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది.
పదేళ్లుగా కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఓ పాత బిల్డింగ్లో రాత్రుళ్లు దెయ్యం తిరుగుతోందంటూ ప్రచారం మొదలైంది. మహిళ నగ్నంగా బోనం ఎత్తుకుని డ్యాన్స్ చేస్తోందని కాలనీ వాసులు చెబుతున్నారు.
బేడ బుడగ జంగాల కాలనీలో చింతల భాను, చింతల బాలరాజు అనే అన్నదమ్ములు గతేడాది అక్టోబర్లో వారం గ్యాప్లోనే మరణించారు. అదే కాలనీకి చెందిన గంధం రాజు అనే వ్యక్తి తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వీటన్నిటికీ చేతబడి, దెయ్యమే కారణమై ఉంటుందని కాలనీవాసులు బలంగా నమ్మడంతో ఒక్కొక్కరుగా వలస బాటపట్టారు.
అలా మంగళవారం నాటికి కాలనీ పూర్తిగా ఖాళీ అయింది. కాలనీకి చెందిన గంధం శేఖర్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. కాలనీలో యువకులు మాత్రమే చనిపోతున్నారని, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్తే రిపోర్టుల్లో ఏమీ లేదనే వస్తుందని చెబుతున్నారు. అక్కడ ఉండటం సేఫ్ కాదని భావించి మండల కేంద్రానికి వెళ్లి బతుకుతున్నామని అంటున్నారు.
