హోంవర్క్ తప్పించుకునేందుకు అత్యాచారం కథ అల్లిన టెన్త్ విద్యార్థిని

Girl tells rape story to escape homework: హోం వర్క్ నుంచి తప్పించుకునేందుకు ఓ విద్యార్థి చేసిన పని సంచలనంగా మారింది. తల్లిదండ్రులను, టీచర్లను, పోలీసులను కంగారు పెట్టించింది. కాసేపు వారందరికి చెమట్లు పట్టించింది. తీరా, నిజం తెలిశాక అంతా విస్తుపోయారు. ఆ అమ్మాయి చెప్పింది అబద్దం అని తేలింది. అయితే ఆ అబద్దం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది తెలిశాక, అందరి మైండ్ బ్లాంక్ అయ్యింది.

హోంవర్క్ నుంచి తప్పించుకునేందుకు అత్యాచారం కథ అల్లిందో విద్యార్థిని. అయితే వైద్య పరీక్షల తర్వాత ఆమె చెప్పింది అబద్దం అని తేలింది. దీంతో పోలీసులు తమదైన స్టైల్ లో గట్టిగా ప్రశ్నించగా, ఆమె చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అడవిలో కనిపించిన బాలిక:
ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపుర తాలూకా నందొళ్లి గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. గత బుధవారం స్కూల్ కి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. కంగారుపడిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని అడవిలో బాలిక కనిపించింది. ఆమెను రక్షించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం:
అనంతరం బాలికను ప్రశ్నించగా తనను ముగ్గురు దుండగులు అపహరించారని, ఆపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. అయితే, వైద్య పరీక్షల్లో మాత్రం అత్యాచారం జరగలేదని తేలింది. దీంతో బాలికను గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం చెప్పింది. హోం వర్క్ చేయలేదని, దాని నుంచి తప్పించుకునేందుకే ఈ నాటకం ఆడినట్టు చెప్పింది. తొలుత కంగారు పడిన తల్లిదండ్రులు, టీచర్లు, పోలీసులు.. ఆ తర్వాత ఏమీ జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

చదువులో డల్:
బాలిక చదువులో డల్ గా ఉండేది. సరిగ్గా హోం వర్క్ చేసేది కాదు. దీంతో తల్లిదండ్రులు నిత్యం ఆమెను కోప్పడేవారు. ఈ క్రమంలో గత బుధవారం తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్లారు. వాళ్ల కూతురి గురించి అడిగారు. మీ కూతురు సరిగా చదవడం లేదని, హోం వర్క్ సగమే చేస్తుందని చెప్పారు. ఈ విషయం బాలికకు తెలిసింది. ఇంటికి వెళితే అమ్మానాన్నల చేతిలో బడితె పూజ తప్పదని భయపడిపోయింది. వారి నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేసింది. స్కూల్ అయిపోయాక బస్సు ఎక్కింది. బస్సులో నుంచి దిగాక, ఇంటికి వెళ్లకుండా తన ఇంటికి సమీపంలోని అడవిలోకి వెళ్లింది.

తల్లిదండ్రుల కొడతారనే భయంతో నాటకం:
అలా అర్థరాత్రి వరకు బాలిక అడవిలోనే గడిపింది. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వెళ్లాలని అనుకుంది. ఇప్పుడు ఇంటికి వెళితే దెబ్బలు తప్పవని భావించిన బాలిక, మరో ప్లాన్ వేసింది. కిడ్నాప్, అత్యాచారం డ్రా ఆడింది. తనకు తానుగా కాళ్లను లెగ్గింగ్స్ సాయంతో కట్టేసుకుంది. వస్త్రాన్ని తన నోట్లో పెట్టుకుంది. ఆ తర్వాత తనకు తానుగా చేతులు కట్టేసుకుంది. అదే సమయంలో ఓ బైక్ అటుగా వస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే బాలిక గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ బైకర్ బాలిక గురించి అతడి తల్లిదండ్రులకు చెప్పాడు. పోలీసులతో కలిసొచ్చిన తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకెళ్లారు.

అసలేం జరిగింది? అడవిలో ఎందుకు ఉన్నావు? అని తల్లిదండ్రులు అడిగారు. దానికి, రెండు బైక్ లపై వచ్చిన దుండగులు తనను కిడ్నాప్ చేశారని, రాత్రి సమయంలో అడవిలో వదిలేశారని చెప్పింది. కిడ్నాప్ గురించి ఎవరికైనా చెబితే నీ తల్లిదండ్రులకు హాని చేస్తామని దుండగులు తనను బెదిరించారని బాలిక చెప్పింది.

ఈ విషయం గ్రామస్తులకు కూడా తెలిసింది. దుండగులు బాలికను కిడ్నాప్ చేశారని తెలిసి అంతా భయపడ్డారు. తమ పిల్లల క్షేమం గురించి అంతా ఆందోళన చెందారు. అయితే, ఇదంతా బాలిక ఆడిన డ్రామా అని పోలీసుల విచారణలో తేలడంతో అంతా విస్తుపోయారు. హోంవర్క్ తప్పించుకునేందుకు, తల్లిదండ్రులు తిడతారనే భయంతో బాలిక ఇలా నాటకం అడిందని తెలిసి నోరెళ్లబెట్టారు.

ట్రెండింగ్ వార్తలు