Gold Coins: టాయ్లెట్ నిర్మాణానికి తవ్వుతుండగా బయటపడ్డ గోల్డ్ కాయిన్లు
టాయ్లెట్ నిర్మాణం కోసం గొయ్యి తవ్వుతుండగా బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణేలు లభ్యమయ్యాయి. ఉత్తరప్రదేశ్.. జాన్పూర్లోని కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన నమోదైంది.
- Subhan Ali Shaik
- Published On : July 18, 2022 / 01:47 PM IST
Gold Coins
Gold Coins: టాయ్లెట్ నిర్మాణం కోసం గొయ్యి తవ్వుతుండగా బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణేలు లభ్యమయ్యాయి. ఉత్తరప్రదేశ్.. జాన్పూర్లోని కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన నమోదైంది. మచాలీ షహర్లోని కజియానా మొహల్లాలో నివాసముంటున్న నూర్జహాన్ అనే వ్యక్తి ఇంట్లో టాయిలెట్ తవ్వుతుండగా ఈ నాణేలు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.
మంగళవారం జరిగిన ఈ ఘటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు కుటుంబ సభ్యులు, కూలీలు. శనివారం సాయంత్రం విషయం పోలీసుల వరకూ చేరడంతో కాయిన్లను సీజ్ చేశారు. కాయిన్లు అన్నీ బ్రిటీష్ కాలం (1889-1912)నాటివి. కొందరు కూలీలను పోలీసులు విచారిస్తుండగా మరికొందరు పరారీలో ఉన్నారు.
ఇమామ్ అలీ రైనీ భార్య నూర్ జహాన్ టాయ్లెట్ కోసం గొయ్యి తవ్విస్తున్నారు. అదే సమయంలో ఒక రాగిపాత్రలో నాణేలు దొరగ్గా కూలీలు పరస్పరం గొడవకు దిగి పని మధ్యలో ఆపేశారు.
Read Also: భారీ వర్షానికి ఆకాశం నుంచి బంగారు నాణేలు?
రెండో రోజు ఉదయం తమంతట తామే వచ్చి నిధి దొరుకుతుందనే ఉద్దేశ్యంతో తవ్వడం మొదలుపెట్టారు. ఆ సమయంలో రైనీ కొడుకు దెయ్యం కథలు చెప్పి.. గోల్డ్ కాయిన్ ఇవ్వాల్సిందేనని భయపెట్టడంతో అతనికి ఒక బంగారు నాణేన్ని ఇచ్చారు కూలీలు.
బుధవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందగా.. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ జరిపారు. రైనీ కొడుకుని తీసుకెళ్లి విచారణ జరపగా ముందుగా నోరువిప్పని కూలీలు.. పోలీస్ స్టైల్ ఎంక్వైరీలో విషయం చెప్పేశారు. మొత్తం తొమ్మిది నాణేలను కూలీలను స్వాధీనం చేసుకున్నామని, అలా పది నాణేలను ప్రభుత్వానికి అందజేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.
