Sharjeel Imam: సీటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ), నేషనల్ సిటిజెన్స్ రిజిస్టర్(ఎన్ఆర్సీ) లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసిన కేసులో అరెస్టైన జవహార్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి షర్జీల్ ఇమామ్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. అయితే బెయిల్ లభించినప్పటికీ అతడు ఇంకా విడుదల కాలేదు. మరో రెండు కేసుల్లో బెయిల్ లభించకపోవడంతో ప్రస్తుతం అతడు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఈ బెయిల్ మంజూరు చేసింది. 2019 డిసెంబర్లో గయాలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, అసంసోల్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలలో సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఇమామ్ను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లతో వీరికి సంబంధం ఉందని చార్జ్షీట్లో పేర్కొన్నారు. ఐపీసీలోని సెక్షన్ 124-ఏ సహా మరిన్ని కేసులు అతడిపై నమోదు చేశారు.
కాగా, ఈ కేసులపై తాజాగా విచారణ పూర్తి చేసిన ఢిల్లీ హైకోర్టు.. శుక్రవారం చట్టబద్ధమైన బెయిల్ మంజూరు చేసింది. షర్జీల్ తరపు న్యాయవాదులు అహ్మద్ ఇబ్రహీం, తాలిబ్ ముస్తఫా బెయిల్ దరఖాస్తును సమర్పించారు. ఇమామ్ 31 నెలల నుంచి కస్టడీలో ఉన్నందున అతని రిలీఫ్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు (ట్రయల్ కోర్టు)ను కోరిన నాలుగు రోజుల తర్వాత ఇమామ్కు బెయిల్ వచ్చింది.