Karnataka Lockdown: లోదుస్తులు కొనుక్కోవాలి.. అనుమతి కోరుతూ సీఎంకు లేఖ!
నా బట్టలు చాలా చినిగిపోయాయి. ముఖ్యంగా ఇన్నర్ వేర్స్ చిల్లులు పడిపోయాయి. దయచేసి షాపులు తెరిపించండి.. నేను లోదుస్తులు కొనుక్కోవాలి అంటూ ఓ వ్యక్తి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాశాడు. దీంతో ఇప్పుడు ఆ లేఖ అంశం కాస్త దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది
- Naresh Mannam
- Published On : June 2, 2021 / 01:04 PM IST
Karnataka Lockdown Need To Buy Underwear Letter To Cm Seeking Permission
Karnataka Lockdown: నా బట్టలు చాలా చినిగిపోయాయి. ముఖ్యంగా ఇన్నర్ వేర్స్ చిల్లులు పడిపోయాయి. దయచేసి షాపులు తెరిపించండి.. నేను లోదుస్తులు కొనుక్కోవాలి అంటూ ఓ వ్యక్తి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాశాడు. దీంతో ఇప్పుడు ఆ లేఖ అంశం కాస్త దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కర్ణాటకలో ముందుగా మే 10 నుంచి 24వ తేదీ వరకు రెండు వారాలు లాక్ డౌన్ ప్రకటించినా కేసుల ఉద్ధృతితో దానిని పొడిగించారు. దీంతో ప్రస్తుతం జూన్ 7 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.
జూన్ 7 తర్వాత కూడా కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో ఓ వ్యక్తి సీఎం యెడియూరప్పకు ఓ లేఖ రాశాడు. ఆ లేఖ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. తన లోదుస్తులు పూర్తిగా పాడయ్యాయని.. వాటిని కొనుక్కునేందుకు షాపులు తెరిపించాలని ఆ లేఖలో రాశాడు. చామరాజపురానికి చెందిన నరసింహమూర్తి ఈ లేఖలో తన బాధను రాసుకొచ్చాడు.
మీకు నా వినతి కాస్త వింతగా అనిపించొచ్చు. కానీ నాకున్న జత బనియన్లు, అండర్ వేర్లు పూర్తిగా చిల్లులు పడ్డాయి. గత రెండు వారాల నుండి కొత్తవి కొనుక్కోవాలని అనుకున్నా లాక్ డౌన్ నేపథ్యంలో షాపులు తెరవడం లేదు. ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ కొనసాగిస్తారని ప్రచారం జరుగుతుంది. అలా కొనసాగించే పక్షంలో వారానికి ఒకసారైనా షాపులు కొద్ది గంటలపాటు తీసినా నాలాంటి వారికి ఇన్ని ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఈ లేఖలో పేర్కొన్నాడు. మరి నరసింహమూర్తి లేఖకు సీఎంఓ ఏవిధంగా సమాధానం ఇస్తుందో.. ఈసారి లాక్ డౌన్ లో తెలుగు రాష్ట్రాలలో మాదిరి కొద్ది గంటలైనా షాపులకు అనుమతిస్తారా అన్నది చూడాల్సి ఉంది.
