VijayaSaiReddy: విశాఖపట్నంలో తాను భూ కబ్జాలకు పాల్పడుతున్నట్టుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. తనకు , తన కుటుంబసభ్యులకు స్థానికంగా సెంట్ భూమి కూడా లేదన్నారు. ఎవరైనా తన పేరుతో భూ కబ్జాలకు పాల్పడితే ఫిర్యాదు చేసేందుకు త్వరలోనే 2 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లు అందుబాటులోకి తెస్తానని చెప్పారు. ఆ నంబర్లకు ఎవరైనా ఫోన్ చేసి కంప్లయింట్ ఇవ్వొచ్చన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తానన్నారు.
భూమి వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని.. పంచాయితీల్లో కలగజేసుకుంటున్నానని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తప్పుపట్టారు విజయసాయిరెడ్డి. హైదరాబాద్ లో ఉండే ఇల్లు కూడా కిరాయిదే అన్నారు. డబ్బుపై తనకు ఆసక్తి లేనేలేదన్నారు.
వైజాగ్ లో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి ఈ కామెంట్స్ చేశారు. ఐతే.. విశాఖపట్నంలో తాను స్థిరపడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు విజయసాయి రెడ్డి. భవిష్యత్తులో ఇక్కడ సెటిల్ అయితే.. దూరంగా భీమిలిలో వ్యవసాయ భూమి కొనుక్కుంటానన్నారు విజయసాయి రెడ్డి.