Navika Kumar given protection: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దీంతో నుపుర్ శర్మను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓ టీవీ డిబేట్లో భాగంగా నుపుర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ డిబేట్ను హోస్ట్ చేసిన టైమ్స్ నౌ సీనియర్ జర్నలిస్ట్ నవిక కుమార్పై సైతం పలు కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసులో ఆమెకు కాస్త ఊరట లభించింది. అరెస్ట్ చేయకుండా సోమవారం సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది.
‘‘తాత్కాలిక చర్యగా, మే 26 ప్రసారానికి సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదులు లేదా భవిష్యత్ ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదుల ప్రకారం పిటిషనర్పై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోరాదు” అని జస్టిస్ క్రిష్ణ మురళి, హిమ కోహ్లీలతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. నవిక కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ‘‘జ్ఞానవాపి మసీదుపై చర్చ జరుగుతోంది. అకస్మాత్తుగా వక్తలలో ఒకరు ఏదో అన్నారు. ఆపై మరొకరు బదులిచ్చారు. యాంకర్ ఈ విషయంలో ఏమీ మాట్లాడలేదు. ఆమెపై అనేక ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి’’ అని పేర్కొన్నారు.
వాదనలు విన్న సుప్రీం.. ప్రస్తుతానికి అయితే అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. టీవీ డిబేట్లో నుపుర్ శర్మ ఒక్కసారిగా మహ్మద్ ప్రవర్త పేరు ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో బీజేపీ ఆమెను సస్పెండ్ చేసింది. కాగా, ఈ కేసులో నుపుర్ శర్మకు జూలైలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 10 వరకు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించింది.
Kejriwal on revdi: ప్రజలకు ఉచితాలొద్దనే వారు దేశద్రోహులు