5G in India: దేశ టెలికాం రంగంలో కొత్త అధ్యయనం ప్రారంభమైంది. దేశంలో మొదటిసారిగా 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో శనివారం ప్రారంభమైన 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022 కార్యక్రమంలో ఈ సేవల్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అనంతరం 5జీ సేవల విశేషతను చాటేలా 5జీ లింక్ ఉపయోగించి ఢిల్లీలో ఉండి స్వీడన్లో రిమోట్ కారు నడిపారు. యూరప్లోని క్లోజ్డ్ ఇండోర్ కోర్సును నావిగేట్ చేసిన కారును మోదీ నడిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోల ప్రకారం.. వర్చువల్ కనెక్షన్ ఉన్న ఒక స్టీరింగ్ ముందు ప్రధాని మోదీ కూర్చున్నారు. అనంతరం బ్రేకులు, యాక్సిలేటర్, స్టీరింగ్ వంటివి ఉపయోగిస్తూ వర్చువల్ ద్వారా వాహనం నడిపారు. ఈ వీడియోలను పలువురు మంత్రులు షేర్ చేస్తూ.. టెలికాం రంగంలో మరో అడుగు ముందుకు పడిందని, భారత్ ప్రపంచాన్ని నడిపిస్తోందంటూ ట్వీట్లు చేస్తున్నారు.
India driving the world.
PM @NarendraModi ji tests driving a car in Europe remotely from Delhi using India’s 5G technology. pic.twitter.com/5ixscozKtg
— Piyush Goyal (@PiyushGoyal) October 1, 2022
ఇక 5జీ నెట్వర్క్ ప్రారంభోత్సవంలో భాగంగా రిలయన్స్ జియో ఏర్పాటు చేసిన స్టాల్ను ప్రధాని మోదీ సందర్శించారు. జియో ట్రూ 5జీ సేవలు ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నారు. వైద్య రంగానికి జియో ట్రూ 5జీ సేవలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆకాశ్ అంబానీ ప్రధాన మంత్రికి వివరించారు. 5జీ సేవలు తొలి దశలో ఎంపిక చేసిన 13 నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. వాటిల్లో.. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్నగర్, కోల్కతా, లక్నో, ముంబై, పూణే నగరాల్లో ఉన్నాయి. ఇందులో చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై నాలుగు మెట్రోలకు ఈరోజు నుండి 5జీ సేవలు ప్రారంభమువుతున్నట్లు తెలుస్తుంది.
5జీ సేవలను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ దృష్టిలో ఇది ఒక ప్రధాన అడుగు అని అన్నారు. 2జీ నుంచి 5జీ కి వచ్చామని, 5జీ నెట్ వర్క్ తో దేశంమరింత దూసుకు వెళ్తుందని, దేశంలో డేటా విప్లవం వచ్చిందని ప్రధాని అన్నారు. భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దేశంగా ఉండడమే కాకుండా, వైర్లెస్ టెక్నాలజీ రూపకల్పనలో సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ప్రధానమైన, చురుకైన పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.