PM Modi praises Venkaiah: వెంకయ్య నాయుడిపై పొగడ్తలు కురిపించిన మోదీ
వెంకయ్య ప్రసంగాల కోసం మేధావులు, అగ్రశ్రేణి జర్నలిస్టులు కూడా ఎదురుచూసేవారని మోదీ గుర్తు చేసుకున్నారు. రథయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్లో వెంకయ్య ప్రసంగాలు అద్భుతంగా ఉండేవని తనకు అద్వాణీ సెక్యూరిటీ సిబ్బంది ద్వారా తెలిసిందన్నారు. వెంకయ్య సూపర్ ఫాస్ట్గా తెలుగు మాట్లాడుతుంటే తమకు ఏమీ అర్థం కాకున్నా సభలకు హాజరైన వారు మాత్రం పూర్తిగా లీనమై విని ఆనందించేవారని వారు చెప్పినట్లు మోదీ గుర్తు చేసుకున్నారు
- tony bekkal
- Published On : August 11, 2022 / 08:11 PM IST
PM Modi praises Venkaiah
PM Modi praises Venkaiah: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. వెంకయ్యను ఆచార్య వినోబా భావేతో పోల్చారు. వినోబా భావే రచనలు తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంటాయని, అదే తరహాలో వెంకయ్య కూడా సూటిగా, సంక్షిప్తంగా, సులభంగా విషయాలను వ్యక్తీకరిస్తారని మోదీ అన్నారు. గురువారం వెంకయ్యకు నరేంద్రమోదీ మూడు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఈ లేఖలో వెంకయ్యను ప్రశంసిస్తూ ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్గా పనిచేస్తున్న కాలంలో వెంకయ్య ప్రసంగాల కోసం మేధావులు, అగ్రశ్రేణి జర్నలిస్టులు కూడా ఎదురుచూసేవారని మోదీ గుర్తు చేసుకున్నారు. రథయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్లో వెంకయ్య ప్రసంగాలు అద్భుతంగా ఉండేవని తనకు అద్వాణీ సెక్యూరిటీ సిబ్బంది ద్వారా తెలిసిందన్నారు. వెంకయ్య సూపర్ ఫాస్ట్గా తెలుగు మాట్లాడుతుంటే తమకు ఏమీ అర్థం కాకున్నా సభలకు హాజరైన వారు మాత్రం పూర్తిగా లీనమై విని ఆనందించేవారని వారు చెప్పినట్లు మోదీ గుర్తు చేసుకున్నారు. వెంకయ్య అద్భుతమైన వక్త అని, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయగలిగే శక్తి సామర్థ్యాలు, ప్రసంగ నైపుణ్యాలు ఆయన సొంతమని ప్రధాని కీర్తించారు.
వెంకయ్య కేంద్ర మంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, ఉప రాష్ట్రపతిగా అత్యుత్తమంగా పని చేశారని మోదీ అన్నారు. ఉప రాష్ట్రపతిగా దేశం నలుమూలలా పర్యటించి యువతను నిరంతరం ప్రోత్సహించారని మోదీ మెచ్చుకున్నారు. రాజ్యసభ చైర్మెన్గా వెంకయ్య సభా సమయం అత్యంత ఉపయుక్తంగా కొనసాగేలా చేశారని మోదీ చెప్పారు. పాత, కొత్త సభ్యులందరికీ అందుబాటులో ఉంటూ సత్సంబంధాలు కొనసాగించారని మోదీ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు అనేది రాజ్యసభ చైర్మెన్గా వెంకయ్యకు ఆనందం కలిగించి ఉండవచ్చని మోదీ చెప్పారు.
BJP workers clash: తిరంగా యాత్రలో బీజేపీ కార్యకర్తల మధ్య కుమ్ములాట
