Saagara Sangamam
Saagara Sangamam: కె.విశ్వనాధ్, ఏడిద నాగేశ్వరరావు, కమల్ హాసన్ల కలయికలో పూర్ణోదయా పతాకంపై నిర్మిచించిన ప్రతిష్టాత్మక, కళాత్మక చిత్రం ‘‘సాగర సంగమం’’.. ఈ చిత్రం జూన్ 3, 1983 న తెలుగులో “సాగర సంగమం”, తమిళంలో “సలంగై ఓలి’’, మలయాళంలో “సాగర సంగమం’’ పేర్లతో ఒకే రోజు విడుదల అయ్యింది. అన్ని భాషల్లో అఖండ విజయం సాధించింది. నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తి ఈ చిత్రం. ఈ విషయం వాళ్ళు స్వయంగా ఎన్నో సార్లు వ్యక్తపరిచారు. ‘శంకరాభరణం’ అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కె.విశ్వనాథ్ – ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మరో సంచలన కళా ఖండం, ‘‘సాగర సంగమం’’..
భారత చలనచిత్ర పరిశ్రమ 100 సంవత్సరాలు సందర్భంగా CNN-IBNs List of the 100 Greatest Indian Films of All Time లో ఈ చిత్రం 13 వ స్థానం దక్కించుకుంది. అలాగే రష్యన్ భాషలోకి అనువదించి అక్కడి 400 థియేటర్లలో ఒకే సారి విడుదలయ్యి వారి అభిమానాన్ని కూడా పొందిన మొట్ట మొదటి తెలుగు చిత్రంగా అరుదైన ఘనత సాధించింది. ఈ చిత్రం శతదినోత్సవంతో పాటు ఎన్నో కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకుంది. బెంగుళూరులో ఒకే థియేటర్లో 511 రోజులు ప్రదర్శింపబడ్డ చిత్రం ‘‘సాగర సంగమం’’.
ఈ చిత్రం విడుదలయ్యాక చాలా మంది శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి డ్యాన్స్ క్లాసులకి వెళ్లేవారు. ఇప్పటికీ లోక నాయకుడు కమల్ హాసన్ తనకు బాగా నచ్చిన చిత్రాల్లో ‘‘సాగర సంగమం’’ పేరే ముందు చెప్తారు. అలాగే కళా తపస్వి శ్రీ కె.విశ్వనాధ్ దర్శక ప్రతిభ ప్రతీ సన్నివేశంలో మనకు కనబడుతుంది. ఇక ఇళయరాజా సంగీతం.. ఈ చిత్రానికి ఓ హైలైట్. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వైవిధ్యంగా కుదిరింది. అప్పటికే ఎన్నో తమిళ సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి ఓ ట్రెండ్ సెట్ చేసిన ఇళయరాజాకు మొట్ట మొదటి సారి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి ఇచ్చిన చిత్రం ‘‘సాగర సంగమం’’.
అలాగే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కీ ఉత్తమ గాయకునిగా జాతీయ అవార్డు. జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, నివాస్ ఫోటోగ్రఫీ, తోట తరణి కళా దర్శకత్వం ఇంకా ఎందరో ప్రతిభావంతుల కలయికే ఈ చిత్రాన్ని All Time Classic గా రూపుదిద్దింది. ఈ చిత్ర శతదినోత్సవానికి హిందీ అగ్ర నటులు రాజకపూర్, సునీల్ దత్ మరియు రాజేంద్ర కుమార్ గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసి ‘‘సాగర సంగమం’’ గురించి ఎంతో గొప్పగా విశ్లేషించారు.
కమల్ హాసన్ నూతి మీద డ్యాన్స్ చేసే “తకిట -తధిమి” పాట, జయప్రదతో కలిసి చేసే “నాద వినోదము’’ క్లైమాక్స్లో వచ్చే “వేదం అణువణువున” పాటల్లో కమల్ హాసన్ చేసిన క్లాసికల్ డ్యాన్సులు ఇప్పటికీ మనకి ఓ కొత్త అనుభూతినిస్తాయి. అలాగే ‘‘మౌనమేలనోయి’’ పాటలో జయప్రద చూపిన హావభావాలు, ఎస్.పి. శైలజ నటన ఈ చిత్రానికి మరో ప్రత్యేకత. ‘సిరి సిరి మువ్వ’, ‘శంకరాభరణం’ తరువాత ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక దృశ్య కావ్యం ‘‘సాగర సంగమం’’. కళకు అంతం లేదు అనే భావన కలిగేందుకే ఈ చిత్రం చివర్లో “NO END FOR ANY ART’’ అని వస్తుంది..