×
Ad

TDP : టీడీపీని సర్వనాశనం చేస్తున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్

ఈ సదస్సుకు పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. స్థానిక నాయకులు పోలీసులతో కుమ్మక్కయ్యారు

  • Published On : September 11, 2021 / 02:23 PM IST

Jc Prabhakar Reddy

TDP JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీపైనే హాట్ కామెంట్స్ చేశారు. అనంతపురంలో రాయలసీమ టీడీపీ నేతల సమావేశాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని.. ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ఐతే.. కార్యకర్తలనే టీడీపీ నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్నికలొస్తే టీడీపీ ఓడటం ఖాయమన్నారు. పార్టీ చీఫ్ చంద్రబాబు మేలుకోకపోతే భారీనష్టం జరగొచ్చని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని… తనకు, ఇతర నేతలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారని.. వాటితో పార్టీకి ఏమాత్రం ప్రయోజనం దక్కే అవకాశాలు లేవన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

రెండేళ్ల నుంచి ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మాజీ మంత్రి కాల్వ సమాచారం ఇవ్వకుండానే … సాగునీటి ప్రాజెక్టులపై సదస్సులు పెడుతున్నారని ఫైరయ్యారు. “ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై సదస్సులు అంటే కార్యకర్తలు వస్తారా..? సదస్సులు కార్యకర్తల సాధక బాధకాలపై పెట్టాలి. కేవలం కాలవ శ్రీనివాసులు కనుసన్నల్లోనే ఈ సదస్సు జరుగుతోంది. ఆయన వెంట.. అనంతపురం టీడీపీ నాయకులు గానీ.. కార్యకర్తలు గానీ లేరు.
అనంతపురం జిల్లాలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది కాబట్టి మేం నాయకులం అయ్యాం. కార్యకర్తల కోసం మీటింగ్ లు పెట్టాలి గానీ.. ఇలాంటి పనికిరాని సదస్సులు శుద్ధ దండగే” అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి

ప్రాజెక్టులపై పోరాటంతో ఫలితం ఉండదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను గుంటూరులో పోలీసులు ముప్పుతిప్పలు పెట్టారు. మరి ఈ సదస్సుకు పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. స్థానిక నాయకులు పోలీసులతో కుమ్మక్కయ్యారు కాబట్టే అనుమతించారని ఆరోపించారు. అనంతపురం జిల్లా అంటే టీడీపీకి కంచుకోట అనీ.. ఇతర నాయకులు దానిని సర్వనాశనం చేస్తున్నారని ఫైరయ్యారు.