Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రిభోజనం ఎందుకంటే?
శరీరం పగటిపూట తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం, జీర్ణమయిన దానిని అన్ని భాగాలకు అందించడం, శ్రమకు తగ్గ శక్తిని ఇస్తూ ఉండటం దీని పని.
- Guntupalli Ramakrishna
- Published On : November 25, 2021 / 11:53 AM IST
Night Food (1)
Dinner : ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి పడుకునే వరకూ ఖాళీ దొరికినప్పుడల్లా ఆకలి లేకపోయినా పొట్టలో ఏదో ఒకటి నింపటం మనిషికి అలవాటైంది. భూమి మీద ఉన్న ప్రాణులలో కొన్ని పగలు తిని, పగలు తిరిగేవి ఉంటే, మరికొన్ని రాత్రికి మాత్రమే తిని, రాత్రులే తిరుగుతూ ఉంటాయి. పగలు తిరిగే ప్రాణి రాత్రికి విశ్రాంతి తీసుకుంటే, రాత్రి తిరిగే ప్రాణి పగటి పూట విశ్రాంతి తీసుకుంటుంది. మనిషిమాత్రం పగలు శ్రమించి, రాత్రికి విశ్రమించాలి. కానీ ఉదయం తినడం ప్రారంభించి పగలు తిన్నది చాలక అర్ధరాత్రి వరకూ ఎదోఒకటి తింటునే ఉంటాడు.
రాత్రి భోజనం విషయంలో చాలా మంది రకరకాల రుచులు కోరుకుంటుంటారు. మాంసాహార వంటలు, పలావులు, ఫ్రైడ్ రైసులు, బీరులు, బ్రాందీలు అన్నీ రాత్రిపూట తినడానికే ఎక్కవ ప్రాధాన్యతను ఇస్తుంటారు. పొట్ట కొన్ని గంటలు పనిచేస్తే, కొన్ని గంటలు విశ్రాంతి తీసుకోవలసిన అవసరం ఉంది. 12 గంటలు పనిచేసి, 12 గంటలు విశ్రాంతి తీసుకోవలసిన పొట్టకు విశ్రాంతే కరువయ్యింది. సహజాహారానికి బదులు అసహజాహారం తీసుకోవడం, అదీ అర్ధరాత్రి వరకు తినడం వలన వివిధ రకాల ఆరోగ్యసమస్యలు వస్తున్నాయి.
శరీరం పగటిపూట తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం, జీర్ణమయిన దానిని అన్ని భాగాలకు అందించడం, శ్రమకు తగ్గ శక్తిని ఇస్తూ ఉండటం దీని పని. రాత్రికి విశ్రాంతి సమయంలో రిపేరు చేసుకోవడం, క్రొత్త కణాలను నిర్మించుకోవడం, మాలిన్యాలను విసర్జించుకోవడం చేస్తుంది. మనం సరైన విశ్రాంతిని ఇవ్వకపోతే ఈ కార్యక్రమాలు ఆగిపోయి అనారోగ్యసమస్యలు తలెత్తుతాయి. అందుకే మన పెద్దలు సూర్యాస్తమయానికి ముందు భోజనం చేయడం మంచిదని చెప్తుండేవారు. ప్రస్తుతం రాత్రి సమయంలో వేళాపాళలేకుండా భోజనం చేసేవారే ఎక్కవ…భోజనం చేసేదే రాత్రి 8-9 గంటలకు. ఉప్పు, కారం నూనెలు వేసిన కూరలు జీర్ణంకావటానికి రాత్రి పూట 6 గంటల సమయం పడుతుంది. అంటే ఆ ఆహారం జీర్ణం అయ్యేసరికే తెల్లవారుజామున 3-4 గంటలు అయిపోతుంది. ఇక ప్రేగులకు విశ్రాంతి దొరికేది 2-3 గంటలు మాత్రమే..
మనం రోజుకి 2-3 గంటలు విశ్రాంతి తీసుకుంటే మనకు ఎంత అలసటగా, బడలికగా ఉంటుందో, అలాగే ప్రేగుల పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కరోజు తిండి లేకపోయినా శరీరం దెబ్బతినదు, అయితే ఒక్కరోజు దేహం నుండి బయటకు వెళ్ళవలసిన చెడు నిలువ ఉండటం వలన రోగాలు కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. మనం రాత్రికి 6-7 గంటలు నిద్ర ద్వారా విశ్రాంతి తీసుకొంటే 18 గంటలు పనిచేయడానికి శక్తి ఉంటుంది. ఆహారం తిన్నాగానీ రాత్రికి విశ్రాంతి లేకపోతే ఏపనిగి శరీరం సహకరించదు. ప్రేగులు కూడా ఇలాగే విశ్రాంతి లేకుండా 24 గంటలు పనిచేస్తే శక్తిని కోల్పోతాయి. విశ్రాంతి లేని శరీరం వ్యర్థ పదార్థాలను నిలువ చేసుకుంటుంది. ఈ పరిస్ధితి చివరకు చిన్నచిన్న వ్యాదులతో ప్రారంభమై అంతిమంగా దీర్ఘకాలిక రోగాలకు పరిస్ధితి దారితీయవచ్చు. అందుకే సూర్యస్తమయానికి ముందే భోజనం చేయటం అలవాటు చేసుకోవటం మంచిది.
