Digestion : జీర్ణప్రక్రియ మెరుగవ్వాలంటే…భోజనం చేశాక!…
భోజనానికి ముందు పుదీనా రసం తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమై తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఉపయోగపడే బాక్టీరియా పెరుగులో ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : March 6, 2022 / 04:04 PM IST
Digestion
Digestion : మనిషి ప్రతిరోజు వివిధ రకాల ఆహారాలు తీసుకుంటుంటాడు. అయితే చాలా మందికి తిన్న ఆహారం సరిగా జీర్ణంకాదు. ఈ సమస్యకు ప్రధాన కారణం అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలేనని వైద్య నిపుణులు చెపుతున్నారు. సమయానికి భోజనం చేయకపోవటం, మద్యపానం, ధూమపానం, బాక్టీరియా ఇన్ఫెక్షన్ తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య తలెత్తుతుంది. అదే క్రమంలో మనం తినే ఆహారాలను బట్టి అవి జీర్ణం అయ్యే సమయం మారుతుంది. శాకాహారం తింటే త్వరగా జీర్ణం అవుతుంది. మాంసాహారం అయితే జీర్ణమయ్యేందుకు ఎక్కవ సమయం పడుతుంది.
కొందరిలో జీర్ణశక్తి సరిగా ఉండకపోవటం వల్ల కొద్ది మొత్తంలో తీసుకున్నా అరగక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు జీర్ణశక్తిని పెంచుకునే వివిధ రకాల చిట్కాలను ట్రై చేయటం వల్ల కొంత ఫలితం పొందవచ్చు. భోజనం చేసిన తరువాత పండ్లను తినటం వల్ల జీర్ణక్రియ మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన గంట తరువాత యాపిల్ పండ్లను తింటే అంతకుముందు తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.అలాగే నారింజ, జామ, దానిమ్మ పండ్లు సైతం జీర్ణక్రియను మెరుగు పర్చటంలో సహాయకారిగా పనిచేస్తాయి.
భోజనానికి ముందు పుదీనా రసం తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమై తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఉపయోగపడే బాక్టీరియా పెరుగులో ఉంటుంది. మనం తినే ఆహరం తో పాటుగా ఒక కప్పు పెరుగు తింటే ఆహరం సులువుగా జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది. మనం తినే ఆహారం లో జీలకర్ర వాడటం వల్ల వంట రుచి మారిపోవడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరిగిపోవటానికి దోహదం చేస్తుంది. అజీర్ణం, అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలకు బొప్పాయి బాగా తోడ్పడుతుంది. భోజనం చేసిన గంట తరువాత బొప్పాయి ముక్కలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
