బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి బాగానే ప్రయత్నిస్తున్నారు. కెరీర్ ప్రారంభంలోనే వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను వంటి పెద్ద దర్శకులతో పనిచేసిన ఈ హీరో గుర్తుండిపోయే విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఈ ఏడాది ‘సీత’ సినిమాతో పాటు మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. సీతా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాదు దీంతో పాటు మరో యాక్షన్ థ్రిల్లర్ను కూడా శ్రీనివాస్ పట్టాలెక్కించారు.
ఈ మధ్య కాలంలో పాత టైటిల్స్ బాగా వాడేసుకుంటున్నారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఇదే చేస్తున్నాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన థ్రిల్లర్ మూవీ రాక్షసన్. విష్ణు విశాల్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్చేసే ఆలోచనలో ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమాకు రైడ్, వీర చిత్రాల ఫేం రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘రాక్షసుడు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. కథా కథనాల పరంగా ఈ టైటిల్ పర్ఫెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్ను ఉగాది పర్వదినాన అధికారికంగా ప్రకటించనున్నారు. హవీష్ లక్ష్మణ్ ప్రొడక్షన్లో ఎస్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాని జూన్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.