Kangana Ranaut Secret Marriage : రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్.. అసలు విషయం ఇది.. వార్నీ ఇంత రచ్చ చేయాలా!
Kangana Ranaut Secret Marriage : కంగనా రనౌత్ రహస్యంగా వివాహం చేసుకున్నారా.. అందుకే మెడలో మంగళసూత్రం ధరించారా..
- Dharani Pilli
- Updated on- May 22, 2026 / 09:14 PM IST
Kangana Ranaut Clears The Rumors of secret marriage Over Viral Pic With Mangalsutra
Kangana Ranaut Secret Marriage : ఈ రోజంతా మీడియా, సోషల్ మీడియాలో హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ గురించి ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. ఇంతకు ఆ వార్త ఏంటంటే.. బాలీవుడ్ క్వీన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని వాటి సారాంశం. అందుకు కారణం.. శుక్రవారం నాడు కంగనా రనౌత్ మెడలో మంగళసూత్రం, ఆకుపచ్చ గాజులు (సాంప్రదాయకంగా వివాహిత మహిళలు ధరించేవి) ధరించిన ఫోటోలు వైరల్ కావడంతో కంగనా రహస్యంగా పెళ్లి చేసుకుంది అంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై కంగనా స్పందిస్తూ అసలేం జరిగిందో వివరించారు.
ఈ వైరల్ ఫోటోపై కంగనా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా క్లారిటీ ఇచ్చారు. “కంగనా రనౌత్ రహస్యంగా వివాహం చేసుకుందా?” అని హిందీలో ఉన్న ఒక పోస్ట్ను ఆమె షేర్ చేశారు. ఆ తర్వాత.. “నేను ప్రతిరోజూ నగరం, పరిసర ప్రాంతాలలో షూటింగ్లో పాల్గొంటున్నాను. సినిమాలో నేను చేయబోయే క్యారెక్టర్ గెటప్ లో ఉన్నప్పుడు ఎవరో నాకు తెలియకుండా ఫోటోలు తీశారు. వీటిల్లో నేను మెడలో మంగళసూత్రం, చేతికి ఆకుపచ్చ గాజులు ధరించాను. ఇంకేముంది చాలా సేపటి నుంచి నాకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అన్నింటి సారాంశం ఒక్కటే. నేను రహస్యంగా వివాహం చేసుకున్నాను అని. అసలు వివాహిత గెటప్ లో కనిపిస్తే అంత పెద్ద రచ్చ చేయాలా?” అంటూ కంగనా అసహనం వ్యక్తం చేశారు.
చివరకు ఈ పుకార్ల గురించి అభిమానులను, ఫాలోవర్లను శాంతింపజేస్తూ తాను రహస్యంగా వివాహం చేసుకున్నాను అంటూ వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని.. తాను ఎవరినీ రహస్యంగా వివాహం చేసుకోలేదని.. చేసుకోబోనని ఆమె ప్రమాణం చేశారు. ఈ పోస్ట్ తో కంగనా రహస్య వివాహం పుకార్లకు బ్రేక్ పడింది.
చిరాగ్ పాస్వాన్తో తనకు ప్రేమాయణం సాగుతోందనే వార్తలను కంగనా తోసిపుచ్చిన కొద్ది రోజులకే ఆమె రహస్యంగా వివాహం చేసుకుంది అంటూ పుకార్లు రావడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే గతంలో చిరాగ్ తో తన రిలేషన్ గురించి కంగనా మాట్లాడుతూ.. చిరాగ్ నా స్నేహితుడు. అతన్ని చూసినప్పుడు నాకు ఒక స్నేహితుడే గుర్తుకు వస్తాడు. అక్కడ ఎలాంటి రొమాన్స్ లేదు, నిజాయితీగా చెబుతున్నాను. మా ఇద్దరికీ చాలా కాలంగా పరిచయం ఉంది… అతను 10 సంవత్సరాల క్రితం నాతో సినిమా చేశాడు. ఒకవేళ మా మధ్య రొమాన్స్ ఉండి ఉంటే, ఈపాటికే మాకు పిల్లలు ఉండేవారు,” అని స్పష్టం చేశారు.
కంగనా మరియు చిరాగ్ పాస్వాన్ కలిసి మొదటిసారిగా 2011 లో తన్వీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘మిలే నా మిలే హమ్’ అనే రొమాంటిక్ డ్రామాలో నటించారు. ఈ సినిమాతోనే చిరాగ్ నటుడిగా అరంగేట్రం చేయగా, కంగనా కథానాయికగా నటించారు. ఇందులో నీరూ బజ్వా, సాగరిక ఘట్గే కూడా నటించారు. ఇక కెరీర్ విషయానికి వస్తే, కంగనా చివరిగా ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కనిపించారు. ఇందులో ఆమె మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.
