Nagarjuna : రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో తెరకెక్కిన కూలీ సినిమా ఆగస్టు 14 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు. అలాగే ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్.. కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా నాగార్జున, సత్యరాజ్, లోకేష్ కానగరాజ్, శృతి హాసన్ హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. నిన్నేపెళ్లాడతా చేసిన తర్వాత అన్నమయ్య చేస్తుంటే ఇప్పుడెందుకు ఇలాంటి కథ అని అన్నారు. నాకు కొత్తదనం ఇష్టం. సెట్కు వెళ్లాక బోర్ కొట్టకూడదంటే డిఫరెంట్ పాత్రలు చేయాలి. అందుకే ఇప్పుడు నెగిటివ్ రోల్ చేశాను. లోకేశ్ నన్ను కలిసి మీరు విలన్గా చేస్తానంటే మీకో కథ చెబుతా. లేదంటే కాసిన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్లిపోతా అన్నారు. లోకేష్ ఖైదీ చూసిన తర్వాత ఎప్పటికైనా ఈ దర్శకుడితో పనిచేయాలని అనుకున్నా. కూలీ కథ చెప్పిన తర్వాత రజనీ సర్ ఈ కథ ఒప్పుకొన్నారా అని అడిగా. ఈ కథలో నా పాత్ర ఆల్ మోస్ట్ హీరోలాంటిది. లోకేష్ హీరో విలన్స్ ని ఈక్వెల్ గా చూపిస్తాడు. నా కెరీర్లో మొదటిసారి లోకేశ్ కథ చెబుతుంటే రికార్డు చేసుకున్నా. ఇంటికి వెళ్లాక మళ్లీ మళ్లీ విన్నా. నాకు అనిపించిన కొన్ని మార్పులు చెప్పా. నేను చెప్పిన చేంజెస్ చేసి ‘సైమన్’ పాత్రను లోకేశ్ తీర్చిదిద్దిన విధానం నాకు నచ్చింది. రజనీ సర్ చెప్పినట్లు ఎప్పుడూ మంచి వాళ్లగానే సినిమాలో నటిస్తే బాగుండదు కదా. వైజాగ్లో మా ఫస్ట్ షూట్ జరిగింది. ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు. కానీ వాళ్లు ఇచ్చిన బడ్జెట్లో 5కోట్లు మిగిల్చి మరీ లోకేశ్ సినిమా పూర్తి చేశాడు. షూట్ సమయంలో ఆరు కెమెరాలతో పనిచేస్తాడు. షూటింగ్ సమయంలో రజనీ సర్ స్వయంగా వచ్చి నన్ను కలిసి మాట్లాడారు. నన్ను కలిసినప్పుడు కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయారు. మీరు ఇలా ఉన్నారని తెలిస్తే మన సినిమాలో నాగార్జున వద్దని లోకేశ్కు చెప్పేవాడిని అని సరదాగా అన్నారు. థాయ్లాండ్లో 17 రోజుల పాటు రాత్రి పూట యాక్షన్ సీక్వెన్స్ తీశాం. 350మందికి పైగా చాలా కష్టపడ్డాం. చివరి రోజు మొత్తం అందరినీ రజనీ సర్ పిలిచి తలో ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చి పంపారు అని తెలిపారు.
ఇక ఈ ఈవెంట్ కి రజినీకాంత్ హాజరవకపోయినా సినిమా నాగురించి మాట్లాడుతూ ఓ వీడియో బైట్ పంపించారు.
ఈ వీడియో బైట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అయింది. ఈ సంవత్సరంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన కూలీ రావడం సంతోషంగా ఉంది. కూలీ నా డైమండ్ జూబ్లీ పిక్చర్. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేశ్ కనగరాజ్ అలా. చాలాఏళ్ల తర్వాత సత్యరాజ్తో చేస్తున్నా ఈ సినిమాలో ఆమిర్ఖాన్ సౌత్ ఫిలిమ్స్ లో మొదటిసారి యాక్ట్ చేస్తున్నారు. కూలీ సబ్జెక్ట్ విన్న వింటనే సైమన్ పాత్ర నేనే చేయాలన్న ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా అని ఎదురుచూశా. చాలా స్టైలిష్గా ఉంటుంది. ఆర్నెళ్ల పాటు వెతికాం. ఈ పాత్ర గురించి ఒక యాక్టర్ తో ఆరుసార్లు సిటింగ్ అయింది. ఆయన్ని ఎలాగైనా ఒప్పిస్తాను అని లోకేశ్ నాతో అన్నప్పుడు ఎవరు అని అడిగితే నాగార్జున పేరు చెప్పగానే షాక్ అయ్యాను. ఆ తర్వాత ఆయన ఒప్పుకొన్నారని తెలిసి హ్యాపీగా అనిపించింది. నాగార్జున దగ్గర చాలా డబ్బుంది. ఆయన డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదు. ఆయనకు ఆ అవసరం లేదు. మేమిద్దరం 30 ఏళ్ల కింద ఒక సినిమా చేశాం. అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఇంకా యంగ్ గా కనిపిస్తున్నారు. నాకు జుట్టు కూడా ఊడిపోయింది. నాగార్జున గారితో మీ ఆరోగ్య రహస్యం ఏంటి అని అడిగితే ఏమీ లేదు సర్.. వ్యాయామం, స్విమ్మింగ్, కొద్దిగా డైట్. సాయంత్రం 6 గంటలకు డిన్నర్ అయిపోతుంది. మా నాన్న నుంచి వచ్చిన జీన్స్ కూడా ఒక కారణం అన్నారు. సైమన్ పాత్రలో ఆయన నటన చూస్తుంటే నాకే ఆశ్చర్యమేసింది. బాషా-ఆంటోనీ ఎలాగో కూలీ-సైమన్ అలా ఉంటుంది అని అన్నారు.