Anushka’s Nishabdham Review: స్టార్ హీరోయిన్ అనుష్క ‘భాగమతి’ తర్వాత నటించిన మరో లేడి ఓరియంటెడ్ మూవీ.. ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం క్రాస్ జోనర్ మూవీ. కోవిడ్ ప్రభావంతో థియేటర్స్లో విడుదల కాకుండా సినిమా చాలా రోజుల వరకు ఆగింది. థియేటర్స్ ఓపెన్ అయ్యే విషయంలో క్లారిటీ రాకపోవడంతో మేకర్స్.. తెలుగులో ‘నిశ్శబ్దం’, తమిళ్, మలయాళంలో ‘సైలెన్స్’ పేరుతో సినిమాను అమెజాన్ ప్రైమ్లో విడుదల చేశారు.
ఇందులో అనుష్క దివ్యాంగురాలి పాత్రలో నటించింది. ఇటువంటి పాత్రలో అనుష్క తన మార్కు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందా? అసలు ‘నిశ్శబ్దం’ అనే టైటిల్ వెనుక అర్థమేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం..
కథ విషయానికొస్తే..
1972లో యు.ఎస్లోని సీయటెల్ ప్రాంతానికి 70 కి.మీ దూరంలోని వుడ్ హౌస్లో ఉండే భార్యాభర్తలు పీటర్, మెలిసాలను ఎవరో చంపేస్తారు. ఆ వుడ్ హౌస్ ఓనర్ జోసెస్ ఆత్మే వారిని హత్య చేసి ఉంటుందని అందరూ అనుకుంటుంటారు. దీంతో పోలీసులు కేసు ఛేదించలేక మిస్టరీగా వదిలేస్తారు. తర్వాత ఆ విల్లాను అందరూ హాంటెడ్ హౌస్గా భావిస్తారు. దాంతో ఆ విల్లాను ఎవరు కొనరు. 2019లో కొలంబియాకు చెందిన బిజినెస్మేన్ మార్టిన్ ఎస్కవాడో ఆ విల్లాను ధైర్యం చేసి కొంటాడు.
కానీ ఆ ఇంట్లో ఉండటానికి అందరూ భయపడుతుంటారు. చాలా ఏళ్ల తర్వాత అంటే.. 2019లో ఆ విల్లాలోకి సాక్షి(అనుష్క), ఆంటోని(మాధవన్) వస్తారు. అప్పటికే వారిద్దరికీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆ విల్లా ఓనర్ జోసెఫ్ వేసిన ఓ పెయింటింగ్ వేయాలని సాక్షి అనుకోవడంతో సాక్షి, ఆంటోనీ అక్కడికి వస్తారు. అయితే ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన కొద్దిసేపటికి అండర్ గ్రౌండ్ రూమ్లోకి వెళ్లిన ఆంటోనీపై ఎటాక్ జరుగడంతో అతను చనిపోతాడు. సాక్షి తప్పించుకుని గాయాలతో బయటపడుతుంది. పోలీస్ కెప్టెన్ రిచర్డ్ (మైకేల్ మ్యాడ్సన్), డిటెక్టివ్ మహా అలియాస్ మహాలక్షీ(అంజలి) కేసును టేకప్ చేస్తారు.
అప్పటికే సీయటెల్లో చాలా మంది అమ్మాయిలు కనపడకుండా పోతారు. దాంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకుంటారు. అప్పటికే ఓ మోడల్ను పెళ్లి చేసుకున్న ఆంటోనీ.. సాక్షికి ఎలా పరిచయమయ్యాడు? సాక్షి ప్రాణ స్నేహితురాలు సోనాలి(షాలిని పాండే) ఏమైంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభిస్తారు. డిటెక్టివ్ మహాలక్ష్మికి సోనాలి కోణంలో మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తూ వస్తుంది. సోనాలి ఎవరు? ఆమె నిజంగానే మిస్సయ్యిందా? సీయటెల్లో కనిపించకుండా పోయిన అమ్మాయిలందరూ ఎవరు? వారేమయ్యారు?.. తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు..
అనుష్క దివ్యాంగురాలి(మాటలు రాని, చెవులు వినపడని) సాక్షి పాత్రలో చాలా చక్కగా నటించింది. పాత్ర పరంగా మాటలు రాకుండా హావభావాల పరంగా నటించడానికి ఆమె చాలా వర్కౌట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అనుష్క చేసిన ఈ డిఫరెంట్ ప్రయత్నానికి ఆమెను అభినందించాలి. కాకపోతే అనుష్క పాత్రలో బలమైన ఎమోషన్స్ను చక్కగా ఎలివేట్ చేయలేదు. ఆమె పడ్డ కష్టానికి పాత్రను మలిచిన తీరు చూస్తే తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇక ప్రధమార్థంలో మాధవన్ పాత్ర పెద్ద ఎఫెక్టివ్గా అనిపించదు కానీ సెకండాఫ్ అంతా అతని పాత్రను బేస్ చేసుకునే రన్ అవుతుంది.
అలాగే హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సేన్ కూడా చాలా మంచి పాత్రలో నటించాడు. డిటెక్టివ్ పాత్రలో అంజలి ఆకట్టుకుంది. షాలిని పాండే, సుబ్బరాజ్ పాత్రలకు ఉన్న ప్రాధాన్యత సెకండాఫ్లోనే. కానీ వారికి చాలా మంచి పాత్రలు లభించాయి. ఇక అవసరాల శ్రీనివాస్ పెద్దగా అవసరం లేని పాత్రలోనే కనిపించాడని చెప్పాలి.
టెక్నీషియన్స్..
షానియల్ డియో సినిమాటోగ్రఫీ సినిమా పర్వాలేదు. గోపి సుందర్ పాటలేవీ ఆకట్టుకునేలా లేవు.. గిరీశ్ నేపథ్య సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సో సో గా ఉంది. ఆర్ట్ డైరెక్టర్ Chad Buffet హాంటెడ్ హౌస్ ను బాగా డిజైన్ చేశారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేదనిపిస్తుంది.
దర్శకుడు హేమంత్ మధుకర్, స్క్రీన్ప్లే రైటర్ కోన వెంకట్ సినిమాను అలా ముందుకు నడిపించారు. కానీ సినిమాలో ఎలాంటి సస్పెన్సూ ఉండదు. ఇరవై నిమిషాల ముందే ట్విస్ట్ రివీల్ అయిపోవడంతో కిక్ పోతుంది. ఓవరాల్గా ‘నిశ్శబ్దం’ సినిమా అనుష్క అభిమానులు చూడాలనుకుంటే చూడొచ్చు..