దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ కళ్లు చెదిరే సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల డిస్నీ+హాట్స్టార్లో విడుదలైన ఈ చిత్రం రికార్డ్ వ్యూయర్ షిప్ను సొంతం చేసుకుంది. సబ్స్క్రైబర్లు, నాన్-సబ్స్క్రైబర్లు అందరూ ఉచితంగా చూసేలా ఈ సినిమాను డిస్నీ+హాట్స్టార్ సంస్థ ఉచితంగా అందుబాటులో ఉంచింది. దీంతో ఈ సినిమా 24 గంటల్లో ఏకంగా తొమ్మిదిన్నర కోట్ల వ్యూస్ సాధించింది.
ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ కలిగిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను కూడా‘దిల్ బెచారా’ దాటేసిందట. అలాగే 10/10 ఐఎమ్డీబీ రేటింగ్ సాధించి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుందీ చిత్రం. ఈ రికార్డ్ వ్యూయర్ షిప్ను దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ వర్గాల వారు కళ్లు చెదిరే కలెక్షన్స్ వివరాలు తెలిపారు.
ఒకవేళ ఈ సినిమా కనుక థియేటర్లలో విడుదలై ఉంటే టికెట్ ధర సగటున రూ.100 వేసుకున్నా తొలి రోజు రూ.950 కోట్లు వసూలు చేసేదని, 2019లో పీవీఆర్ టికెట్ రేటు రూ.207 లెక్కన వేసుకుంటే కనుక రూ.వెయ్యి కోట్లకు పైచిలుకు వసూళ్లు సాధించేదని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.