రోడ్డు ప్రమాదంలో తండ్రితోపాటు నిర్మాత దుర్మరణం..

  • Publish Date - August 19, 2020 / 06:03 PM IST

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌లలో ఒకరైన గుండాల కమలాకర్‌రెడ్డి ఈరోజు(బుధవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణ​ చెందారు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న కమలాకర్‌రెడ్డి, ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) ఇటీవల కరోనా బారిన పడ్డారు.



మెరుగైన చికిత్సకోసం ఆయనను అంబులెన్స్‌లో హైదరాబాద్‌ తరలిస్తున్న క్రమంలో అంబులెన్స్‌ నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రి కుమారులు ఇద్దరూ మృత్యువాత పడటడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.



ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాను కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాకు కమలాకర్‌రెడ్డి కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతేగాక తెలుగు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు ‘అర్జున్‌రెడ్డి’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలను పంపిణీ చేశారు. పలు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్‌ సినిమాలను కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. కమలాకర్‌రెడ్డి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.