హీరోయిన్లు చనిపోయినప్పుడు సుశాంత్ కేసులా దర్యాప్తు చేయలేదే?..

  • Publish Date - September 4, 2020 / 03:28 PM IST

Vijaya Shanthi about Sushant Suicide: బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు అనేక కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఈ కేసులో మొట్టమొదటి అరెస్ట్ కూడా చేసింది. ఈ వ్య‌వ‌హారంపై బాలీవుడ్ మీడియాలో వాడివేడిగా చ‌ర్చలు, హిందీ చిత్ర పరిశ్రమలో నెపోటిజంపై ఆరోపణలు వంటివి జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో సీనియర్ నటి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మం ద్వారా స్పందించారు.


‘‘దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ… మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి మనందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు… దర్యాప్తులు జరిగాయా? చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశాం. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది.


వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. అయితే దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. ఈ విషయంపైన ఒక జాతీయ టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ… సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకే తీరులో కొనసాగాలని, అప్పుడే న్యాయాన్ని ఆశించగలమని అన్నారు.


సంచలనాత్మకమైన ఇలాంటి ఎన్నో కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు తగిన ఆధారాల్ని సమర్పించిన తర్వాత కూడా… వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి’’ అన్నారు.





ట్రెండింగ్ వార్తలు