Manchuvishnu
MAA Elections: ‘మా’ అసోసియేషన్కు పాతికేళ్ల చరిత్ర ఉంది. ఎన్నో ఎన్నికలు జరిగాయి. కొన్ని ఏకగ్రీవంగా జరిగితే.. మరికొన్ని ఓటింగ్ ప్రక్రియలో జరిగాయి. 2015 ముందు వరకూ ‘మా’ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేవి. 2015 నుంచి నేటి వరకూ వివాదాలే. ఎప్పుడూ ‘మా’ ఎన్నికలు వివాదాల్లోనే ముగుస్తున్నాయి. పోటీలో ఉన్న ప్రతిఒక్కరూ ఒక ప్యానల్పై మరొకరు మాటల దాడులు, విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. 2019 నుంచి ఆ వేడి మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. 2021లో వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకుంది.
ఈ ఏడాది ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే.. విమర్శలు, ప్రతి విమర్శ, ఆరోపణలతోపాటు ఎప్పుడూ లేని కులం, ప్రాంతం అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. లోకల్, నాన్ లోకల్ అంటూ.. ఆ అంశం చుట్టూనే ఎన్నికలని నడిపించారు. ఎట్టకేలకు ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ గెలిచింది. అధ్యక్షుడిగా విష్ణు 127ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. మంచు విష్ణుకు 396ఓట్లు రాగా.. ప్రకాష్ రాజ్కు 269ఓట్లు వచ్చాయి.
మంచు విష్ణు ప్యానెల్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా మాదాల రవి జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు గెలిచారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీ ఉత్తేజ్.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఈసీ మెంబర్లుగా అనసూయ, శివారెడ్డి, సురేష్ కొండేటి, కౌశిక్, సమీర్, తనిష్ విజయం సాధించారు.