Haryana vehicles collided : హర్యానాలోని యమునా నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో అంబాలా-యమునానగర్- సహరన్ పూర్ జాతీయ రహదారిపై 15 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కార్లలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు.
పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో ముందున్న వాహనాలు కనబడకపోవడంతో హైవేపై వెళ్తోన్న 15 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు పేర్కొన్నారు. నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని తెలిపారు. క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించామని వెల్లడించారు. మిగిలిన వాహనాలను దారి మళ్లించారు.