Rain-Hit Maharashtra: మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి 36మంది మృతి.. రంగంలోకి హెలికాఫ్టర్లు
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొంకన్ తీరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
- venkaiahnaidu
- Published On : July 23, 2021 / 05:17 PM IST
Mumbai2 (1)
Rain-Hit Maharashtra మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొంకన్ తీరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాయ్గఢ్ జిల్లాలోని మహద్ తలై గ్రామంలో గురువారం రాత్రి కొండచరియలు విరిగి పడ్డ ఘటనలో 36 మంది మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
దాదాపు 300 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వారిని రక్షించేందుకు న్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డు సిబ్బంది రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.
ఇక, ముంబై నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్గడ్లోని వరద బాధిత ప్రాంతాల నుండి ప్రజలను తరలించడానికి హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. మరోవైపు,భారీ వర్షాలకు.. ముంబైకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్నగిరి జిల్లాలోని తీరప్రాంత పట్టణం చిప్లున్ బాగా ప్రభావితమైంది. 70 వేల మందికిపైగా జనాభా ఉన్న ఈ నగరం సగానికిపైగా వరద నీటిలో మునిగిపోయింది. ఐదు వేల మందికిపైగా ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. సహాయకచర్యల కోసం ఆర్మీ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది.
