corona new cases in India : దేశంలో కరోనా కంట్రోల్ తప్పింది. గడచిన 24గంటల్లో 53 వేల 480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఒక్కరోజులోనే కరోనాతో 354మంది చనిపోయారు. కేసులు సంఖ్య కాస్త తగ్గినట్లు కనిపించిన మరణాల సంఖ్య పెరిగిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5లక్షల 50 వేలు దాటింది.
కరోనా మహమ్మారితో భారత్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. యావత్ దేశం ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. కరోనా సెకండ్వేవ్ ఎంట్రీతో పరిస్థితి పెనం మీద నుంచి పోయ్యిలో పడ్డట్లయింది. దేశంలో కరోనా ఆందోళనకర స్థాయి నుంచి ప్రమాదకరస్థాయికి మారిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరీ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దేశం మొత్తం ముప్పు ముంగిట్లో నిలిచింది. ఎవరూ నిశ్చింతగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఈ ఏడాది కూడా కరోనా పీడ వీడదని క్లారిటీ వచ్చేసింది.
దేశంలో కరోనా వైరస్ తీవ్రత మరింత విషమంగా మారిందని కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా మహారాష్ట్రలో కరోనా పరిస్థితి దారుణంగా తయారైంది. దేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన మొదటి 10 జిల్లాల్లో 8 మహారాష్ట్రలోనే ఉన్నాయి. పుణె, ముంబై, నాగ్పూర్, ఠాణే, నాసిక్, ఔరంగాబాద్, అహ్మద్ నగర్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మహారాష్ట్రలో గత వారంలో సగటున 23శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. అంటే.. 100 మందిని పరీక్షిస్తే 23 మందికి పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో వరుసగా.. పంజాబ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ , తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి.
ఈ రాష్ట్రాల్లోనే కాదు.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ కేసుల సంఖ్య కొద్దిరోజులుగా భారీగా పెరుగుతోంది. పంజాబ్లో అక్కడి ప్రభుత్వ అలసత్వం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయిని తెలుస్తోంది. కరోనా పరీక్షలు ఎక్కువగా చేయడంలేదు. వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ ఉంచడంలోనూ పంజాబ్ ప్రభుత్వం విఫలమవుతోంది. ఫిబ్రవరిలో పంజాబ్లో సగటు రోజువారీ కేసులు 240గా ఉండగా.. ఇప్పుడు రోజుకు 2 వేల 700 కేసులు బయపడుతున్నాయి.
మళ్లీ ప్రమాదకరంగా మారుతున్న కరోనాను కట్టడి చేయడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఎవరికైనా వైరస్ పాజిటివ్ వస్తే.. వారి కుటుంబసభ్యులను క్వారంటైన్ చేస్తే సరిపోదని.. ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించలని తెలిపింది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ తప్పనిసరిగా తేల్చింది. అలాగే విపత్తు నిర్వహణ చట్టం కింద.. కరోనా నిబంధనలు అందరూ పాటించేలా చూడాలని వెల్లడించింది. రాష్ట్రాలు టెస్టింగ్పై దృష్టి సారించాలని, పాజిటివిటీ రేటు, కేసుల పెరుగుదల శాతం, మరణాల రేటు, కేసులు రెట్టింపు అవుతున్న వేగం లాంటివాటిని రియల్టైమ్ బేసిస్లో గుర్తించాలని సూచించింది. ఇక యాంటీజెన్ టెస్టుల కన్నా ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేయాలని కోరింది.
కరోనా సీన్ అయిపోయిందనుకున్న సమయంలో ఒక్కసారిగా కేసులు భారీగా పెరిగిపోయాయి. సెకండ్వేవ్తో ఎంట్రీ ఇచ్చిన వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. పరిస్థితిని గమనిస్తే వచ్చే ఏప్రిల్లో రోజుకు లక్షకుపైగా కేసులు నమోదయ్యేలా కనిపిస్తున్నాయి. సెకండ్వేవ్ పీక్ స్టేజ్కు వెళ్తే దాన్ని అదుపు చేయడం సాధ్యం కాని పని. ఇకనైన ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ..అలసత్వం వీడితే పరిస్థితి కాస్త బెటర్గా ఉండే అవకాశం ఉంది. లేకపోతే ఇండియాకు యూరోప్ దేశాలకు పట్టిన గతే పడుతుంది.