వ్యాక్సిన్ వద్దు బాబోయ్..తాజా సర్వే
- venkaiahnaidu
- Published On : January 26, 2021 / 02:49 PM IST
india covid-19-vaccine
60% Indians still hesitant towards Covid-19 vaccine, shows survey కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశంలోని మెజార్టీ ప్రజలు మొగ్గుచూపడం లేదు. తక్షణమే కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రస్తుతం 60శాతం మంది విముఖత చూపుతున్నారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు విముఖత చూపుతున్న వారి సంఖ్య గత 3 వారాల్లో 69 శాతం నుంచి 60 శాతానికి తగ్గిందని లోకల్సర్కిల్స్ చేపట్టిన సర్వేలో తేలింది. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్పై స్పష్టత కొరవడటమే వ్యాక్సిన్ పట్ల భయానికి ప్రధాన కారణమని సర్వే తెలిపింది.
వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయాలు, క్లినికల్ ట్రయల్స్లో ప్రతికూల ఫలితాలు రావడం వంటి పరిణామాలతో గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన సర్వేలో 69 శాతం మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు సానుకూలంగా లేరని తేలింది. జనవరి తొలి వారం వరకూ ఈ సంఖ్య అలాగే ఉంది. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ పట్ల విముఖత చూపేవారి సంఖ్య 60 శాతానికి తగ్గింది.
వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయనేది తెలియకపోవడంతోనే తాము వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధంగా లేమని సర్వేలో పాల్గొన్నవారిలో 59 శాతం మంది తెలిపారు. వ్యాక్సిన్ సామర్థ్యంపై అనిశ్చితితో తాము వ్యాక్సిన్కు దూరంగా ఉంటామని 14 శాతం మంది వెల్లడించారు. కొవిడ్-19 ఏ క్షణంలోనైనా దూరమవుతుందని వ్యాక్సిన్ అవసరం లేదని 4 శాతం మంది చెప్పగా, ఇక కొత్తరకం కరోనా వైరస్లను ప్రస్తుత వ్యాక్సిన్లు అడ్డుకోలేవని మరో 4 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది.
