Independence Day Celebrations Red Fort : ఎర్రకోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ప్రసంగం.. Live
Independence Day Celebrations Red Fort : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వేదికగా ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
- Harish Thanniru
- Updated on- August 15, 2026 / 08:51 AM IST
Independence Day Celebrations Red Fort
Independence Day Celebrations Red Fort : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వేదికగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎర్రకోటపై 13వ సారి వరుసగా ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఇదిలాఉంటే.. తొలుత ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవవందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల ప్రారంభ సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈరోజు మనమంతా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ప్రతి హృదయంలో ‘వందేమాతరం’ ధ్వనిస్తోంది. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. కొత్త తీర్మానాలతో సరికొత్త ఉత్సాహంతో దేశం ముందుకు సాగుతోందని అన్నారు.
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ ఎదుగుతోంది. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ సాధనే మన లక్ష్యమని, వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని, వికసిత్ భారత్ లక్ష్యంగా మరింత వేగంగా ముందుకెళ్లాలని అన్నారు. దేశానికి యువతే అతిపెద్ద శక్తి.. వికసిత్ భారత్ లో యువకుల పాత్ర ఎంతో కీలకమని ప్రధాని పేర్కొన్నారు. 12ఏళ్లలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించామని, ఆత్మనిర్భర్ భారత్ ను ముందుకు తీసుకెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు.
కరోనా నుంచి బయటపడగానే యుద్ధాలు ముంచేశాయి. ముందు యుక్రెయిన్ యుద్ధం, ఇప్పుడు ఇరాన్ యుద్ధం. యుద్ధాలు వస్తే కొందరు ప్రజలను భయపెట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజలకు ఇబ్బందులు రానివ్వలేదు. సంక్షోభం వస్తుందని ముందే ఊహించి చర్యలు తీసుకున్నామని, దేశ అభివృద్ధిని అడ్డుకోవటం ఎవరితరం కాదని మోదీ అన్నారు. యూరియా, డీఏపీ ధరలు పెరిగినా రైతులకు సబ్సిడీ ఇస్తున్నామని, రైతుల భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోస్తుందని మోదీ పేర్కొన్నారు. భారత్ లో స్థిరమైన ప్రభుత్వం ఉందని, భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థి దిశగా వెళ్తోందని తెలిపారు.
