×
Ad

Video: క్లాస్‌రూమ్‌లో అమ్మాయిని కాల్చి చంపి, తానూ కాల్చుకుని.. 3 క్షణాల్లో అంతా జరిగిపోయింది.. విద్యార్థులు పరుగులు

అమ్మాయి బయటకు వెళ్లగా అబ్బాయి కూడా ఆమె వెంటే వెళ్లాడు. మళ్లీ క్లాస్‌లోకి వచ్చాక బ్యాగులో నుంచి తుపాకీ తీసి కాల్చాడు.

  • పంజాబ్ తార్న్ తారన్ జిల్లాలో ఘటన
  • లా ఫస్టియర్ విద్యార్థిని మృతి
  • అబ్బాయికి ఆసుపత్రిలో చికిత్స

Punjab: కాలేజీలో ఓ అమ్మాయిపై అబ్బాయి కాల్పులు జరిపి చంపేశాడు. ఆ తర్వాత తానూ అదే తుపాకీతో కాల్చుకున్నాడు. కేవలం మూడు క్షణాల్లో అంతా జరిగిపోయింది.

పంజాబ్ తార్న్ తారన్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉస్మాలోని మై భాగో లా కాలేజీ ఫస్టియర్ విద్యార్థిని సందీప్ కౌర్‌ను ఆమె క్లాస్‌ విద్యార్థి ప్రిన్స్‌ రాజ్‌ కాల్చి చంపాడు. ఆ తర్వాత తుపాకితో తనను తానే కాల్చుకుని, కుప్పకూలిపోగా అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కెమెరాలో రికార్డైంది.

మృతి చెందిన యువతి నౌషెహ్రా పన్నువాన్‌లో ఉండేదని పోలీసులు గుర్తించారు. నిందితుడు ప్రిన్స్‌ రాజ్‌ జలంధర్ జిల్లా మల్లియాన్ గ్రామ నివాసి.

Also Read: 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, 12,993 మంది అభ్యర్థులు.. మున్సిపోల్స్ పై ఫుల్ డిటెయిల్స్

సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఉదయం 9.15 గంటలకు ప్రిన్స్ రాజ్ తరగతి గదిలోకి ప్రవేశించి సందీప్ కౌర్ పక్క నుంచి నడిచాడు. ఆమె చేసిన వ్యాఖ్యలకు అతడు స్పందించనట్లు కనిపించింది. అనంతరం ఆమె బయటకు వెళ్లగా, రాజ్ ఆమె వెంటే వెళ్లాడు. మరో సహ విద్యార్థి జోక్యం చేసుకునే ప్రయత్నం చేశాడు.

తర్వాత వీడియోలో మరో విద్యార్థి నవ్వుతూ రాజ్, కౌర్ ఇద్దరినీ తరగతి గది వెనుక భాగానికి తీసుకెళ్లినట్లు కనిపించింది. ఇద్దరు యువతులు చివరి బెంచ్ వద్ద కూర్చోగా, రాజ్ వారి ముందు కూర్చున్నాడు. కౌర్ నిలబడి ఉన్న సమయంలో రాజ్ లేచి తన బ్యాగ్ నుంచి గన్‌ తీసి వెనక్కి తిరిగి కౌర్ తలపై కాల్చాడు. అనంతరం మూడు అడుగులు వేసి తన తలపై తానే కాల్చుకున్నాడు. ఆ తర్వాత క్లాస్‌ రూమ్‌లోని విద్యార్థులు అంతా వణికిపోయి, బయటకు పరుగులు తీశారు.

రాజ్ ఎందుకు కౌర్‌ను హత్య చేశాడన్న విషయం ఇప్పటివరకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోంది. ఉస్మా గ్రామంలో ఉన్న న్యాయ కళాశాలలో ఇద్దరూ ప్రథమ సంవత్సరం చదువుతున్నారని పోలీసులు చెప్పారు.