Union Minister Nitin Gadkari: 2025 నుంచి అన్ని ట్రక్కుల్లో డ్రైవర్ క్యాబిన్లలో తప్పనిసరిగా ఎయిర్ కండిషన్ అందుబాటులో ఉండాలని, ఈ మేరకు సోమవారం ఫైలుపై సంతకం చేయడం జరిగిందని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2025 నుంచి దేశంలో తయారయ్యే ప్రతీ ట్రక్కులో డ్రైవర్ క్యాబిన్లో ఏసీ ఉండాలని, అదేవిధంగా ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న ట్రక్కుల్లోనూ ఏసీ క్యాబిన్లు ఏర్పాటు చేయాలని మంత్రి చెప్పారు. భారతదేశంలో లారీ డ్రైవర్లు శ్రమజీవులని, రోజుకు 12 నుంచి 14 గంటల పాటు స్టీరింగ్ ముందే కూర్చొని ఉంటారని, అలాంటి డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండేలా ట్రక్కులో డ్రైవర్ క్యాబిన్లను తీర్చిదిద్దాల్సిందేనని ఆటో మొబైల్ కంపెనీలను కేంద్ర మంత్రి ఆదేశించారు.
పలు కంపెనీలు తయారుచేసే అత్యాధునిక ట్రక్కులు ఇప్పటికే ఎయిర్ కండీషన్ క్యాబిన్లతో వస్తున్నాయని చెప్పారు. చాలా సంవత్సరాలుగా ఈ సమస్యపై చర్చ జరుగుతుందని, అయినా భారతదేశంలోని డ్రైవర్లు అప్గ్రేడ్ కాలేదని అన్నారు. లారీల్లో డ్రైవర్ క్యాబిన్లో ఎయిర్ కండీషన్ అప్గ్రేడ్ చేయడానికి సుమారు 18 నెలలు సమయం ఇవ్వటం జరిగిందని, అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని మంత్రి చెప్పారు. గడువు ముగిసిన తరువాత అన్ని ట్రక్కులోని డ్రైవర్ క్యాబిన్లలో ఎయిర్ కండిషన్ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను అధికారుల సమక్షంలో ఆమోదించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ట్రక్కు డ్రైవర్లు 43 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలో విధులు నిర్వహిస్తుంటారని, డ్రైవర్ క్యాబిన్లో ఏసీ బిగించడం వల్ల డ్రైవర్లు మరింత సౌకర్యవంతంగా వాహనం నడుపుతారని మంత్రి చెప్పారు. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ఈ ప్రతిపాదన చేశానని, అయితే ట్రక్కు ఖరీదు పెరిగిపోతుందని, ఏసీ కారణంగా డ్రైవర్లు నిద్రమత్తుతో ప్రమాదాలు పెరుగతాయని ట్రక్కుల తయారీదారులు, యాజమానులు వాదించారని గడ్కరీ చెప్పారు. అయితే, తాజాగా ట్రక్కుల్లోని డ్రైవర్ క్యాబిన్లలో ఏసీలను అమర్చడం తప్పనిసరి చేస్తూ రూల్ తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.