Afghanistan – India: అతి త్వరలో భారత్ నుంచి పాక్ మీదుగా ఆఫ్ఘన్కు చేరనున్న గోధుమలు
ఆఫ్ఘన్ చేరాల్సిన భారత సహాయాన్ని తమ భూభాగం మీదుగా తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు భారత్ కోరే ఏ సహాయాన్నైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాక్ విదేశాంగ కార్యదర్శి తెలిపారు
- Bharath Reddy
- Published On : January 22, 2022 / 12:36 PM IST
Afghan
Afghanistan – India: తాలిబన్ల చేతిలో చిక్కుకుని తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు చేయూతనిచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆకలి కేకలతో అల్లాడుతున్న ఆఫ్ఘన్ ప్రజలను మానవతాదృక్పదంతో ఆదుకునేందుకు వైద్యసహాయం, ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు గత అక్టోబర్లో భారత ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అందులో భాగంగా మందులు, కరోనా వాక్సిన్లు ఇతర వైద్య సహాయాలు మరియు 50 వేల టన్నుల గోధుమలను ఆఫ్ఘన్ కు అందిస్తామని కేంద్రం తెలిపింది. ఈమేరకు ఇప్పటికే 5 లక్షల కరోనా వాక్సిన్లను, ఒకటిన్నర టన్నుల మందులను ఆఫ్ఘన్ కు పంపిణీ చేసిన భారత ప్రభుత్వం, అతిత్వరలో 50 వేల టన్నుల గోధుమలను పంపిణీ చేయనుంది.
read: Bose Statue: తెలంగాణ గ్రానైట్ రాయితో సుభాష్ చంద్రబోస్ విగ్రహం తయారు
అయితే భారత్ నుంచి గోధుమలను తరలించేందుకు పాకిస్థాన్ మీదుగా వాహనాలు ఆఫ్ఘన్ చేరాల్సి ఉంది. ఈక్రమంలో వాహనాలను తమ భూభాగంలో నుంచి అనుమతించబోమని మొదట పాకిస్తాన్ ప్రకటించినా, అనంతరం మానవతాదృక్పదంతో స్పందించి అనుమతి ఇచ్చింది. ఆఫ్ఘన్ చేరాల్సిన భారత సహాయాన్ని తమ భూభాగం మీదుగా తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు భారత్ కోరే ఏ సహాయాన్నైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తెలిపారు.
Also read: Mumbai Building Fire : ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, 17 మందికి గాయాలు
ఈమేరకు 50 వేల టన్నుల గోధుమల రవాణాకు సంబందించి ఆఫ్ఘన్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల వివరాలు, ట్రక్ డ్రైవర్ల వివరాలను ఇతర అనుమతి పత్రాలను ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు అందించింది. అన్ని విషయాలను సమీక్షించిన పాకిస్తాన్ విదేశాంగశాఖ..రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని మూడు వారాల క్రితం భారత ప్రతినిధులకు తెలిపారు. దీంతో 50 వేల టన్నుల గోధుమలను భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు రోడ్డు మార్గాన తరలించేందుకు మార్గం సుగమం అయింది. అన్ని కుదిరితే ఫిబ్రవరి మొదటి వారంలోనే భారత్ నుంచి ఆఫ్ఘన్ కు గోధుమలను తరలించనున్నారు.
Also Read: US – Canada: అక్రమంగా సరిహద్దులు దాటుతూ అతిశీతల వాతావరణానికి భారతీయ కుటుంబం బలి
