After Meeting Bengal Governor, Sourav Ganguly Share Stage With Amit Shah బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. రాజకీయాల్లో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు గంగూలీని బీజేపీలో చేర్చుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో ఆదివారం వెస్ట్ బెంగాల్ గవర్నర్ ను గంగూలీ కలవడం చర్చనీయాంశం కాగా..ఇవాళ దిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన కార్యక్రమంలో గంగూలీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వేదిక పంచుకోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది.
కేంద్ర మాజీ మంత్రి, డీడీసీఏ మాజీ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగింది. రూ.15 లక్షల విలువైన 6 అడుగుల జైట్లీ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గంగూలీ కూడా హాజరయ్యారు. రూ.15 లక్షల విలువైన 6 అడుగుల జైట్లీ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో గంగూలీ-షా మధ్య రాజకీయంపై చర్చ జరిగిందా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
మరోవైపు, అమిత్ షాతో భేటీ వార్తలను గంగూలీ ఖండించాడు. సదరు కార్యక్రమానికి ఢిల్లీ వెళ్లే సమయంలో విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేం లేదని గంగూలీ బదులిచ్చాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన కార్యక్రమానికి మాత్రమే తాను హాజరవుతున్నానని… అమిత్ షాతో ఎలాంటి భేటీ లేదని సౌరవ్ గంగూలీ సృష్టం చేశారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్ను కలిసిన విషయంపైనా గంగూలీ స్పందిచాడు. భేటీని రాజకీయ కోణంలో చూడవద్దని అన్నారు. గవర్నర్ మిమ్మల్ని కలవాలి అనుకుంటే మీరు వెళ్లాల్సిందే. కనుక ఈ విషయాన్ని అలానే వదిలేస్తే మంచిది అని దాదా వ్యాఖ్యానించారు.
కాగా,బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గంగూలీ ఆదివారం.. బెంగాల్ గవర్నర్ను కలవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ మాజీ క్రికెటర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ను కలవడం చర్చనీయాంశమైంది. అయితే రాజ్భవన్ వర్గాలు మాత్రం గంగూలీ.. మర్యాదపూర్వకంగానే గవర్నర్ను కలిశారని, ఇందులో రాజకీయపరమైన అంశాలకు తావులేదని పేర్కొన్నాయి. గవర్నర్ కూడా కాసేపటికే ట్వీట్ చేశారు. పురాతన క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ను సందర్శించాలని గంగూలీ కోరారని, అందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.
మరోవైపు, గతంలో కూడా గంగూలీ బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను అప్పుడే గంగూలీ ఖండించాడు. ప్రస్తుతం అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఉండటం గమనార్హం. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ బీసీసీఐ కోశాధికారిగా ఉన్నారు.